మోడీ, అమిత్ షాతో పెట్టుకుంటే మూడినట్లే. ఇది మరో సారి రుజువు అయింది. శనివారం శివసేన పాలిట శనివారమే అయింది. రాత్రి హ్యాపీగా, తాపీగా నిద్రపోయిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరేకు తెల్లారేసరికి దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. బాలధాకరే వారసుడు గా ఉన్న ఉద్దవ్ పులి కాస్తా పిల్లి అయిపోయి బిక్కమొగం వేసింది. మరి కొద్ది గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాననుకున్న ఉద్ధవ్ థాక్రేకు పెళ్ళి కొడుకు మారిపోయాడని తెలియడంతో పెట్టిన గగ్గోలు దేశమంతా రీసౌడ్ గా వినిపించింది.
అవును మరి ఇది వాజ్ పేయ్, అద్వానీ కాలం నాటి బీజేపీ కాదన్నది ముందుగా ఉద్ధవ్ థాక్రే గుర్తించకపోవడమే అసలు కధకు మూలం. పైగా మోడీ, అమిత్ షాల ఎత్తుకు జిత్తులను దేశమంతా చూస్తోంది. మరి వారితో ఆరేళ్ళ పాటు అంటకాగిన ఉద్ధవ్ థాక్రే గ్రహించలేదంటే ఆయన రాజకీయ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తొంది. ఇక మూడు రోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీని మరాఠా యోధుడు శరద్ పవార్ కలిశారు. ఆ ఏకాంత భేటీ మీద కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన శివసేన పులి గుడ్డిగా నమ్మేసింది. ఆ ఫలితమే ఇపుడు అనుభవిస్తోందని అంటున్నారు.
ఇక బీజేపీకి మెజారిటీ లేదు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తమని శరద్ పవార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూంటే పక్కనే కూర్చుని ఉద్ధవ్ ధాక్రే మరోమారు గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి బీజేపీకి మద్దతు ఇంటా బయటా చాలానే దక్కుతోంది. ఇండిపెండెట్లు బీజేపీ వైపే ఉన్నారు. ఇక శివసేనలోని కూడా 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీజేపే వైపు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఈ నేపధ్యంలో శివసేన మొత్తం పని పట్టేందుకు కూడా మోడీ షాలు భారీ పొలిటికల్ వ్యూహాన్నే రచించారని అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం శివసేన పార్టీ రెండుగా చీలిపోవడం ఖాయం. కేంద్రంలో అధికారం ఉంది. గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చారు. జంపింగు జఫాంగుల ఆపరేషన్ విషయంలో బీజేపీ మాస్టర్ డిగ్రీ ఎపుడో చేసింది. ఇంకా అధికారంలోకివస్తామని నంగనాచిలా మరాఠా యోధుడు శరద్ పవార్ కబుర్లు చెబుతూంటే నమ్మిన బేల పులి ఒక్క ఉధ్ధవ్ థాక్రే మాత్రమే మరి.