ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై మ‌రోమారు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీన‌ట‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ ఆరు నెల‌ల పాల‌న రిపోర్ట్ అంటూ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో జ‌న‌సేన పార్టీ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ఆరు నెలల పాలన గురించి సూక్ష్మంగా ఆరు మాటల్లో చెప్పాలంటే ``విధ్వంసం...దుదుడుకుతనం... కక్ష సాధింపు... మానసిక వేదన... అనిశ్చితి... విచ్ఛిన్నం...ఇవే జగన్ రెడ్డి ఆరు నెలల పాలన ఆనవాళ్ళు`` అంటూ కామెంట్  చేసింది. 

 

ఒక్కో అంశం గురించి జ‌న‌సేన పార్టీ వివ‌రిస్తూ... కూల్చివేతల పర్వానికి తెర తీసి తన పాలనలో విధ్వంసానికి శ్రీకారం చుట్టారని మండిప‌డింది. ``ఉద్దేశపూర్వకంగానే వరద నీటితో రాజకీయ క్రీడలు సాగించారు. ఇసుకను అందుబాటులో లేకుండా చేసి లక్షల మంది కార్మికుల కడుపులు కొట్టారు. భవన నిర్మాణ కార్మికుల్లో బతుకు భయాన్ని సృష్టించి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకువచ్చారు. దుందుడుకుతనంతో చేపట్టిన చర్యలు పాలనలో అపసవ్యతను చాటిచెప్పారు. కాంట్రాక్టులను రద్దు చేయడం ద్వారా వ్యవస్థలను గందరగోళపరిచారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు నెలల తరబడి నిలిచిపోయాయి. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పీపీఏల రద్దు వ్యవహారంపై జపాన్ రాయబారి తన అసంతృప్తిని బహిరంగ పరిచారు. అమరావతి రాజధానిలో పనులు నిలిపివేయడంపై సింగపూర్ ప్రభుత్వం నిరసన తెలిపి వైదొలగింది. ఈ దుందుడుకు చర్యలతో ఇప్పుడిక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లు ఎదుర్కోవలసిందే.`` అని మండిప‌డ్డారు. 

 

కక్ష సాధింపుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి సామాజిక అశాంతి రేపుతున్నారని జ‌న‌సేన పార్టీ ఆరోపించింది. ``శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్త మొదలుకొని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వరకూ పోలీస్ వేధింపులు, కేసులు బనాయిస్తూ కక్ష సాధిస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికేయడం, వార్తా ఛానెళ్లు బ్యాన్ చేయడం, చట్టాల ముసుగులో జర్నలిస్టులకి సంకెళ్ళు వేయడం, దుర్గి మండలంలో ఊళ్ళకు ఊళ్ళు మగాళ్లు లేకుండా ఖాళీ చేయించడం, తమకు ఓటు వేయని ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, రహదారులు మూసేయడం... సోషల్ మీడియాలో ఎవరు ఒక మాట అన్నా కేసులు పెట్టి వేధించడం, ఊళ్లలో భయానక వాతావరణం సృష్టించడం – ఇవీ జగన్ రెడ్డి పాలనలో కక్ష సాధింపులకు ఆనవాళ్ళు.`` అంటూ వివ‌రించారు.

 


ఇటు ఉద్యోగుల్లో...అటు నిరుద్యోగుల్లో మానసిక వేదన నింపార‌ని జ‌న‌సేన పార్టీ విరుచుకుప‌డింది. ``విలేజ్ వాలంటీర్లు అని 5 లక్షల ఉద్యోగాలు ప్రకటించి 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపారు. 35 లక్ష మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టారు. 27 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్ళిపోయారు. ప్రభుత్వ విధానం వల్ల 1.65 లక్షల మందికిపైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ గాలిలో ఉంది. 90 వేల పైచిలుకు ఉన్న తెలుగు ఉపాధ్యాయులలో – ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగా కొత్తవారిని పెట్టుకొంటారు అనే భయాలు నెలకొన్నాయి. పార్టీలనీ, వేరే కులాలని వేధిస్తుంటే స్థానిక వ్యాపారవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, పెట్టుబడులు ఆంధ్రకి ఇక రావు.. తద్వారా ఉద్యోగావకాశాలు ఉండవు అనే నిస్సహాయత, మానసిక వేదన నిరుద్యోగుల్లో నెలకొన్నాయి. `` అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటని ప‌వ‌న్ పార్టీ ఈ సంద‌ర్భంగా సందేహం వ్య‌క్తం చేసింది. ``వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధానిగా ఉంటుందా అనే అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులు ఇస్తుందా? నవరత్నాలకు నిధులు ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకు అవసరమైన డబ్బులు ఉన్నాయా? రూ. రెండున్నర లక్షల కోట్లపైన అప్పు ఉంది. పెట్టుబడులు లేవు... పెట్టుబడులు పెట్టినవారిని పంపేశారు. అసలు రాష్ట్ర ఆర్థిక స్థితి ఏమిటనే ఆందోళన నెలకొంది.`` అని పేర్కొంది.
 


తెలుగు భాష... భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నం అవుతోంద‌ని జ‌న‌సేన ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ``ఆంగ్ల భాష బోధన అనే వాదనతో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నానికి శ్రీకారం చుట్టారు. 151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకొందాం.`` అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: