సస్పెన్స్ థ్రిల్లర్ను మించిన ట్విస్టులతో...దాదాపు నెలరోజులుగా సాగిన మహారాష్ట్ర రాజకీయం...కొలిక్కివచ్చింది. ట్విస్టులు తాత్కలికమే అయినా...ప్రభుత్వ ఏర్పాటుపై శుభం కార్డు పడింది. ఎడతెరపిలేకుండా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చి మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి గద్దెనెక్కనున్నాయని....శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్వయంగా ప్రకటించగా..మరుసటి రోజుకు సీన్ మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పీఠం అధిరోహించారు. దీంతో ఉద్దవ్ షాక్ తినాల్సి వచ్చింది. అయితే, ఉద్ధవ్ థాక్రే సతీమణి రశ్మీ ఠాక్రే కారణంగా....శివసేన ఇలా బక్రా అయిపోయిందంటున్నారు.
భాల్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన పార్టీలో ఇప్పటివరకూ ఎవరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేదు. అయితే, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా పార్టీ రథసారథి ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీలో దిగారు. ఆదిత్య పోటీ చేయడానికి కారణం ఆయన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే కాదని...తల్లి రశ్మీ ఠాక్రే అని తెలుస్తోంది. ముందుగా ఉద్ధవ్ ఠాక్రేని పోటీ చేయమని ఒత్తిడి తేగా ఆయన ప్రత్యక్ష పోటీకి ససేమిరా అనడంతో తనయుడు ఆదిత్య థాక్రేని ఎన్నికల్లో పోటీకి దింపినట్లు సమాచారం. ఆదిత్య గెలుపొందడంతో, ముఖ్యమంత్రి పదవి శివసేనకిస్తే ఉద్ధవ్ పీఠమెక్కాలని, ఒకవేళ తొలి రెండున్నరేళ్ళు బీజేపీ సీఎం సీటు తీసుకుంటే.. ఆదిత్యను ఉప ముఖ్యమంత్రిని చేయాలని రశ్మీ కండీషన్ పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీ తన దారి తాను చూసుకుందని....శివసేనకు ఆఖరికి నిరాశే ఎదురైందని అంటున్నారు.
ఇదిలాఉండగా, శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ను పలువురు తప్పుపడుతున్నారు. సంజయ్ రౌత్ చేసిన కామెంట్లు కాకరేపాయని చెప్తున్నారు. ఓ దశలో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ జోక్యంతో శివసేన-బీజేపీ మళ్ళీ దగ్గరవుతాయని భావించిన తరుణంలో రెండు పార్టీల మధ్య దూరం పెంచాయి. మొత్తంగా ఈ ఇద్దరు శివసేనకు సీఎం పీఠం దక్కకపోవడమే కాకుండా...సీఎం సీటు కోసం కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి సిద్దపడడం ద్వారా హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా వున్న ముద్రను కూడా శివసేన కోల్పోయినట్లయ్యిందని వ్యాఖ్యానిస్తున్నారు.