తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఆయనకు ఏమైంది? ఊహించని భయం మొదలైందా? దేశంలో తానే సీనియర్ను అని...తనకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూనియర్ అని అవసరం ఉన్న చోటా...లేనిచోటా డబ్బా కొట్టుకునే బాబు...ఇప్పుడు అదే ప్రధానమంత్రి సారథ్యంలో జరిగిన ప్రజాస్వామ్యం అయ్యే నిర్ణయంపై ఎందుకు స్పందించలేదు? బాబుకు చలిజ్వరం వచ్చిందా లేదంటే... ప్రధాని మోదీ తనకు ఎక్కడ చుక్కలు చూపిస్తాడో అనే వణుకు మొదలైందా...ఇప్పటికే ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూపంలో ఎదుర్కుంటున్న షాకులను తట్టుకోలేకపోతున్నపుడు... ఇక మోదీపై కాలు దువ్వడం కంటే కామ్గా ఉండటమే మేలనుకుంటున్నారా....ఈ ప్రశ్నలు... అనుమానాలు... సందేహాలు... ఆరోపణలు...అన్నీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికగా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి...దేశమంతా నిద్రిస్తుండగా బీజేపీ ‘పొలిటికల్ స్ట్రైక్' నిర్వహించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్సీపీ అధినేత శరద్పవార్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ మూడు పార్టీలకు బీజేపీ షాక్ ఇచ్చింది. పావులు కదపడంతో.. శరద్పవార్ అన్న కుమారుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ అర్ధరాత్రి తిరుగుబాటు చేశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి మద్దతు కోసం తమ పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్న లేఖను గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీకి అందించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 5:47 గంటలకు రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం గెజిట్ జారీచేయగా.. ఉదయం 8.01 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్పవార్ ప్రమాణం చేశారు.
ఈ పరిణామం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. చిన్నా చితకా పార్టీల నుంచి మొదలుకొని...ముఖ్యనేతలంతా...ఈ పరిణామంపై స్పందించారు. సహజంగానే...అధికారం చేపట్టిన బీజేపీ, దాని మిత్రపక్షాలు శుభాకాంక్షలు తెలిపాయి. ‘మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్కు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్కు శుభాకాంక్షలు. రాష్ర్ట ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్లు అత్యంత శ్రద్ధాసక్తులతో పని చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ...‘దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నదని నేను విశ్వసిస్తున్నా. వారి హయాంలో మహారాష్ర్ట అభివృద్ధి కొత్త ప్రమాణాల్ని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నా’.అని పేర్కొన్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ పరిణామంపై రియాక్టవుతూ...``అజిత్ది క్రమశిక్షణ ఉల్లంఘన. బలపరీక్షలో బీజేపీ నెగ్గలేదు.. మాకు 170 మంది ఎమ్మెల్యేల బలముంది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం.` అని ప్రకటించారు. అన్న అజిత్ పవార్పై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ట్వీట్ చేస్తూ... `మా పార్టీ చీలింది.. కుటుంబమూ చీలింది.. ఇక ఎవర్ని నమ్మేది? ఎంతగా ప్రేమించాం ఆయనను.. చివరికి ఇదా ప్రతిఫలం.` అంటే ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ ఆఘాడి (వీబీఏ) అధినేత ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ... ‘ఎన్సీపీకి చెందిన కొందరు నాయకులు(శరద్ పవార్) ఇటీవల మోదీ, అమిత్ షాను కలిశారు. రైతుల సమస్యల గురించి ఈ సమావేశం జరిగినట్టు చెప్పారు. రెండు రోజుల తర్వాత, మహారాష్ర్ట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రైతులకు పరిహారం ప్రకటించారు. మోదీ-పవార్ భేటీలో ఏదో జరిగింది. అదేంటో తెలియదు.`` అని వ్యాఖ్యానించారు.
ఇలా ఎవరికి వారు తమ వెర్షన్ వినిపిస్తే....దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢీ కొడుతున్నానని ప్రకటించుకున్న నేత అయిన చంద్రబాబు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రతిదానికి స్పందించే...మీడియా ముందుకు వచ్చే..ఆఖరికి ట్విట్టర్లో అయినా రియాక్లయ్యే బాబు ఇప్పుడు కిక్కురుమనడం లేదు. ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకునే చంద్రబాబు గొంతు మూగబోయిందా లేదంటే..మోదీ మార్కు కేసులు, షాకులు విచారణల భయం పట్టుకుందా? అనేది సోషల్ మీడియాలో ఎదురవుతున్న ప్రశ్నల పరంపర. ఆఖరికి తన మార్కు `అనుకూల మీడియాలో లీకులు` ఇచ్చే ధైర్యం కూడా చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు...అంటూ బాబు వైఖరిపై డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.