ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏక్షణాన్నా ఏమైనా జరగొచ్చన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎవరూ ఏ పార్టీలో చేరుతారో. ఏ నాయకుడు ఎందులోకి జంప్ చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పలువురు నాయకులు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ని మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో సగం పైగా రాష్ట్రాల్లో పాగా వేసిన కమలనాథులు దక్షిణాది రాష్ట్రాల్లో కమలాన్ని వికసింపచేసేందుకు గట్టిగానే నడుం బిగించారు.
కర్ణాటకలో పక్కా ప్లాన్ తో అధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఇప్పుడు కమలం తెలుగు రాష్ట్రాలపై గురి పెట్టింది. ఓ వైపు తెలంగాణపై దృష్టిపెడుతూనే, మరోవైపు ఏపీలో నెలకొన్న రాజకీయా పరిస్థితిపై నజర్ పెట్టారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ఎంపీలు కాషాయం కండువా కప్పుకోగా, వీరితో పాటు పలువురు సీనియర్లు, ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడ్డారు కమలనాథులు. అయితే ఈ రాజకీయాలకు దుబాయ్ ని వేదికగా చేసుకుంటున్నారు.
ఇవాళ దుబాయ్ లో సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ ఎంపీలతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. దీనితో పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు దుబాయ్ కు వెళ్లనున్నారు. ఇటు సీఎం రమేష్ సైతం ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేశారు. దుబాయ్ లో గెస్ట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. దుబాయ్ లో ఓవైపు నిశ్చితార్థంతో పాటు మరోవైపు పెద్ద ఎత్తున రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబాయ్ లో బీజేపీ పెద్దలతో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్య ఛాన్స్ ఉందంటున్నారు రాజికీయ విశ్లేషకులు.
దుబాయ్ వేదికగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనూ, రాష్ట్రంలోను బీజేపీకి టచ్ లోకి పలువురు నేతలు వస్తున్నారు. అటు అధికార పార్టీ వైసీపీ ఎంపీలు సైతం ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఏపీ రాజకీయాలతో పాటు, టీడీపీలో భారీ కుదుపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీలో బీజేపీ ఆకర్ష్ జోరుగా నడుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కమలం పార్టీకి వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు దగ్గరవుతున్నారన్న వాదన కూడా తెరపైకి వస్తుంది. మొత్తానికి ఏపీలో ఏం జరగనుంది? అన్న విషయం తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడాలో మరి.