ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను కుక్కలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. జగన్ నిర్యుదోగులకి దయతలచి ఉద్యోగాలిచ్చినట్లుగా ఆయన మాట్లాడడంతో అన్ని వైపులా నుంచి తీవ్ర వ్యతిరేక వెల్లువెత్తుతోంది.

 

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణ దాసు ఈ వ్యాఖ్యలు చేశారు. కుక్కకి బిస్కెట్ వేస్తే విశ్వాసంగా ఉంటుందని.. అలాంటిది నిరుద్యోగుల కోసం జగన్ ఇంత చేస్తున్నా కనీసం వారికీ చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పై యువత భగ్గుమంటున్నారు.

 

అయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి "కుక్క కి బిస్కెట్ వేస్తే విశ్వాసం ఉంటుంది. మనిషికి  చిన్న సాయం చేస్తే కృతజ్ఞతగా ఉంటారు. ఇటువంటి ముఖ్యమంత్రి మంచి అవకాశాలు కల్పిస్తున్నా కనీసం చప్పట్లు కొట్టడానికి కూడా మీకు చేతులు రావడం లేదు. ఇది చాలా అన్యాయం. మనలో మార్పు రావాలి,ఆలోచనా విధానం మారాలి. నిజాయితీ పరుడికి ఏం కావాలి. మీ నుంచి హర్షధ్వానాలు.. ఈ చప్పట్లే కావాలి" అని ఆయన అన్నప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. అయితే మంత్రి వ్యాఖ్యల పై మాత్రం  నిరుద్యోగులు మండి పడుతున్నారు.

 

ధర్మాన వ్యాఖ్యలను నిరసిస్తూ ట్విటర్ వేదికగా టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మంత్రి నిరుద్యోగులను కుక్కల తో పోల్చడం అధికారం తెచ్చిన తల పొగరుకి ఇది నిదర్శనమంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి ఏడాదికి 4వేల కోట్ల ప్రజాధనం దోచేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా? గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాన్ని లీక్ చేసి పేపర్ 5లక్షలకు అమ్ముకొని 19 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు చప్పట్లు కొట్టాలా? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: