జనగామలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్ పార్థసారధి (30), సోషల్ మీడియా ఇంఛార్జ్ పూర్ణ(27) మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం అర్దరాత్రి జనగామా జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంత్రి దయాకర్ రావు హైదరాబాబాద్ నుంచి పాలకుర్తికి బయలు దేరారు. జనగామ జిల్లా కేంద్రం వరకు కాన్వాయ్ లోని వాహనాలన్నీ కలిసే వచ్చాయి. మంత్రితో ఉన్న కాన్వాయ్ మాత్రం వెళ్లిపోగా.. అందులోని ఒక వాహనం మధ్యలో కాసేపు ఆగి బయలు దేరింది. లింగాలఘనపురం మండలం చీటూరు శివారులో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపక్కన పడిపోయింది. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అదే వాహనంలో ఉన్న గన్మెన్ నరేశ్, అటెండర్ తాతారావు, వ్యక్తిగత పీఏ శివ లు గాయాలతో బయట పడ్డారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను వైద్యం కోసం జనగామ జిల్లా హాస్పిటల్ కి తరలించారు. మంత్రి దయాకర్రావు ఆస్పత్రికి చేరకుని క్షతగాత్రులను పరామర్శించారు. హాస్పిటల్లో చికిత్స వివరాలను అడిగితెలుసుకుని, అక్కడే కొద్దిసేపు ఉన్నారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో వాహనంలో ప్రయాణిస్తుండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. అయితే, తన వద్ద పనిచేసే సిబ్బందిలో ఇద్దరు ఈ ప్రమాదంలో కన్నుమూయడం ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. నిత్యం తన వెన్నంటి ఉండే డ్రైవర్ పార్థసారథి, సోషల్ మీడియా ఇన్ఛార్జి పూర్ణలు మృతి చెందడంతో మంత్రి దయాకర్రావు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనతోపాటు డీసీపీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఆసుపత్రికి చేరుకుని సమీక్షించారు.