ఊహించని ఓటమిని ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నష్ట నివారణా చర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీని బతికించుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్త్రుత పర్యటనలు చేస్తున్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్ళకుండా ఉండటానికి చర్యలు చేపట్టినా వాళ్ళు ఆగడం లేదు. దీనితో నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించి కార్యకర్తలతో మమేకమయ్యే పరిస్థితికి వచ్చారు.
ఇన్నాళ్ళు వాళ్ళను పక్కన పెట్టిన అధినేత... ఇప్పుడు వాళ్ళ జపం చేస్తున్నారు. ఇది పక్కన పెడితే... ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుకి జిల్లా నేతలు కీలక విషయాలు చెప్పారు. పార్టీ ఓటమికి వాళ్ళు చెప్పిన కారణాలు విని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. సంక్షేమ పథకాలు ప్రకటించి వాటిని 5 నుంచి 8 శాతం వరకు మాత్రం వారికే లబ్ది చేకూర్చారని మిగిలిన వాళ్ళు కోపంతో ఓట్లు వేయలేదని చంద్రబాబుకి చెప్పారట నేతలు.
అదే విధంగా జిల్లాలో ఎక్కువ వర్గ విభేదాలు ఉన్న సంగతి మీ సర్వేలలో వెల్లడైనా మీరు చూసి చూడనట్టు పోవడం పార్టీని ఇబ్బంది పెట్టిందని, ముఖ్యంగా సీనియర్ నేతల వ్యవహారశైలి తో క్యాడర్ పార్టీకి దూరం జరిగిందని నమ్మిన వారికి పదవులు ఇవ్వకుండా అవకాశ వాదులకు పదవులు ఇచ్చారనే భావనలో లో ఉన్న క్యాడర్ పార్టీకి పని చేయలేదని తద్వారా కీలక మండలాల్లో భారీగా ఓట్లు కోల్పోయామని చెప్పారట.
ఇక ఇంచార్జ్ మంత్రులు, ఇంచార్జులు, పరిశీలకులు అంటూ నియమించిన వారే వర్గాలను ఏర్పాటు చేయడంతో క్యాడర్ చికాకు పడిందని దాని నష్ట౦ గురించి మీకు చెప్పినా మీరు వినలేదని నాయకులు చంద్రబాబుకి వివరించారట. ఏదేమైనా వీళ్లంతా బాబును చెడామడా ఏకేస్తూ బాబు తప్పులే ఎత్తి చూపే సరికి ఆయన కాస్త డైలమాలో పడ్డారట. వాళ్లంతా అక్కడే తమ అసహనం వ్యక్తం చేయడంతో మళ్లీ ఈ పొరపాట్లు రిపీట్ కాకుండా చూస్తానని ఆయన వాళ్లకు హామీ ఇచ్చారట. దీంతో వాళ్లు శాంతించారట.