రాజకీయం అంటేనే ఈ చదరంగం ఇందులో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటేనే నాయకులకు మనుగడ ఉంటుందని నమ్ముతారు. ఇదే విషయాన్ని ఇక్కడ జరిగిన సంఘటన నిరూపిస్తుంది. అదేమంటే మహారాష్ట్ర అసెంబ్లీలో త్వరలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న బీజేపీ ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందట.
ఈ దశలో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయట. ఇందులో భాగంగా వేర్వేరు హోటళ్లకు తమ ఎమ్మెల్యేలను తరలించి పార్టీ నుండి జంప్ కాకుండా గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశాయి. ఇంత చేసిన కమలనాథులు ఆయా పార్టీలను ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇందుకు గాను ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి బీజేపీ నిఘా పెట్టినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి.. ముంబైలోని రెనైజాన్స్ హోటల్లో ఇద్దరు పోలీసులు మఫ్టీలో తిరుగుతున్న విషయాన్ని ఎన్సీపీ నేతలు గుర్తించి నిలదీయడం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ సర్కార్ ఉసిగొల్పడంతోనే పోలీసులు ఇలా మాములు చొక్కాలు ధరించి.. తమపై గూఢచర్యం నెరుపుతున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఈ సంఘటనతో అప్రమత్తమైన ఎన్సీపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలను ఆ హోటల్ నుంచి హోటల్ హయత్కు ఆదివారం సాయంత్రం మార్చింది.
ఇక అధికార పార్టీ నేతల అండతో కొందరు గూఢాచారులుగా వ్యవహరిస్తున్న వారు ఎమ్మెల్యేల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీజేపీకి చెరవేస్తున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సైతం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్లో బీజేపీ కూడా రూమ్లు బుక్ చేస్తోందని, తద్వారా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో బీజేపీ గాలానికి అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్కు తరలించారు. అటు శివసేన తన ఎమ్మెల్యేలను కూడా గట్టి నిఘా నడుమ ముంబై ఎయిర్పోర్ట్కు సమీపంలోని లలిత హోటల్లో ఉంచిందట. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మొత్తానికి ఇప్పుడు జరిగే ఈ చర్యలు సినిమాను తలపిస్తున్నాయి. అందుకే అంటారు లోకంలో అధికారం ఎవరికి చేదు అని...