మహారాష్ట్ర రాజకీయాలను కంపు చేసిన అజిత్ పవార్ ను శరద్ పవార్ కుటుంబసభ్యులు సెంటిమెంటుతో కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపితో చేతులు కలిపేందుకు అజిత్ ఎన్సీపి ఎంఎల్ఏల్లోనే  చీలిక తెచ్చిన విషయం తెలిసిందే. తిరిగి అజిత్ ను దారికి తెచ్చుకునేందుకు శరద్ పవార్ కుటుంబం సెంటిమెంటును ప్రయోగిస్తోంది.

 

శరద్ పవార్ కూతురు, ఎంపి సుప్రియా సూలే అజిత్ కు ఓ ఎస్ఎంఎస్ పంపారు. అందులో అజిత్ ను తిరిగి ఎన్సీపి కుంటుంబంలోకి వచ్చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే శరద్ పవార్ కుటుంబానికే చెందిన ఎంఎల్ఏ  జగదీష్ పవార్ అజిత్ తో కలిసున్న తమ ఫ్యామిలి ఫొటోలను తన ఫేస్ బుక్ వాల్ లో పోస్టు చేశారు. అజిత్ ను వెనక్కు వేచ్చేయాలంటూ కోరారు.

 

అలాగే పార్టీలో కీలక నేత అయిన ఛగన్ భుజభల్ అజిత్ తో భేటి అయ్యారు. శరద్ పవార్ కుటుంబంతో కానీ ఎన్సీపి నేతలతో  అజిత్ కున్న సుదీర్ఘమైన అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ఎన్సీపిలోని వివిధ స్ధాయిలోని నేతలు కూడా అజిత్ తో తమకున్న బంధాన్ని అనేక రూపాల్లో గుర్తు చేసుకుంటూ వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర రూపాల్లో గుర్తు చేస్తున్నారు.

 

మొత్తం మీద జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అజిత్ పై పెద్ద ఎత్తున సెంటిమెంటు అస్త్రాలను శరద్ పవార్ కుటుంబం, ఎన్సీపి నేతలు ప్రయోగిస్తున్న విషయం అర్ధమైపోతోంది. కాకపోతే అజిత్ నుండి ఎటువంటి స్పందన వస్తోందన్న విషయమే ఇప్పటి వరకూ బయటపడలేదు.

 

ఈ నేపధ్యంలోనే ఛగన్ భుజభల్-అజిత్ భేటి జరగటం చాలా కీలకమనే చెప్పాలి. శరద్ దూతగా ఛగన్ ఏ ఏ అంశాలపై అజిత్ తో మాట్లాడుతున్నది బయటకు రాలేదు. మరి వీరి ప్రయత్నాలకు గనుక అజిత్ లొంగిపోతే పోయేది బిజెపి పరువు కాదు నరేంద్రమోడి, అమిత్ షాల పరువే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: