జాతీయ రాజకీయాల్లో బలవంతపు ప్రయోగాల ద్వారా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ ఇప్పుడు తన దృష్టిని ప్రధానంగా ఏపీ, తెలంగాణపై పెట్టింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్లను టార్గెట్ చేసే ప్రయత్నాలు అయితే చాపకింద నీరులా ప్రారంభమయ్యాయి. అయితే వీరిద్దరిలో ముందుగా జగన్ కంటే కేసీఆర్నే బీజేపీ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కెసిఆర్ ఇప్పుడు బిజెపి టార్గెట్ అవుతారా...? అంటే అవుననే సమాధనమే వినపడుతుంది.
ఇన్నాళ్ళు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పెద్దగా కష్టపడని కెసిఆర్ మహారాష్ట్రలో బిజెపి అధికారం చేపట్టిన విధానం చూసి ఒక రకంగా కంగుతిని ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కెసిఆర్ ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు తెలంగాణాలో అనే విషయం హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత స్పష్టంగా అర్ధమైంది. ఇక ఆయనకు ఏ ఇబ్బందులు ఉండవని ప్రతి ఒక్కరు భావించారు. కాని మహారాష్ట్ర పరిణామం తర్వాత తెలంగాణాలో ప్రభుత్వాన్ని తెరాస కూల్చే అవకాశం ఉంటుందన్న సందేహాలు అయితే వినిపిస్తున్నాయి.
ఆర్టీసి సమ్మెతో కెసిఆర్ ని ఇబ్బంది పెడదామని బిజెపి చూసింది అయినా సరే ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆర్టీసి ఉద్యమం మళ్ళీ తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆర్టీసి ఉద్యోగులను కెసిఆర్ విధుల్లోకి తీసుకుంటాను అని ప్రకటించలేదు. సమ్మె విరమించి మూడు రోజులు అవుతున్నా ఆయన నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని ఏ స్పందనా కనపడటం లేదు. ఈ పరిణామాలనో లేదా మరో ఉద్యమాన్ని కావాలని రెచ్చగొట్టడం ద్వారానో తెలంగాణాలో రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యం లేదన్న సందేహాలు కూడా ఇప్పుడు కొందరు రేకెత్తిస్తున్నారు.
ప్రధానంగా కెసిఆర్ లక్ష్యంగా బిజెపి నేతలు ఇప్పటికే కొందరు అధికారులతో పావులు కదుపుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బిజెపి ఇక్కడ ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తనకు ఇబ్బంది వస్తే ఏదైనా చేసే కెసిఆర్ ఇక్కడ బీజేపీ ఎత్తుగడలను ఎలా ? తిప్పి కొడతారో ? చూడాలి.