మచిలీపట్నం(బందరు)...కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్. ఇక్కడ ఎన్నికల్లో గెలిచే పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా బందరులో ఇదే ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. 2014, 2019లలో కూడా ఇలాగే జరిగింది. 2014లో టీడీపీ గెలిస్తే, 2019 లో వైసీపీ గెలిచింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే. ఈ రెండు సార్లు గెలిచిన వారు ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసే అవకాశాలు కొట్టేశారు. 2014లో టీడీపీ తరుపున తొలిసారి గెలిచిన వెంటనే కొల్లు రవీంద్రని మంత్రి పదవి వరించింది. ఇక 2019లో వైసీపీ తరుపున గెలిచిన పేర్ని నాని కూడా తొలిసారి మంత్రి అయ్యారు.
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన పేర్నికి ఈ అవకాశం దక్కలేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. అయితే దొరికిన అవకాశాన్ని పేర్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర చేసిన తప్పులని నాని చేయడం లేదు. తొలిసారి గెలిచిన వెంటనే మంత్రి అయిన కొల్లు ఆ అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేదు. మంత్రిగా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేయొచ్చు. కొల్లు అదేం చేయలేదు. పైగా మంత్రి కావడంతో నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఏదో ఎన్నికల ముందు హడావిడి చేశారు తప్ప చేసింది ఏమి లేదు. ఆఖరికి బందరు వాసుల చిరకాల కోరిక పోర్టు విషయంలో కూడా చివరిలో పనులు మొదలుపెట్టి ప్రజాగ్రహానికి గురయ్యారు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే పేర్ని మాత్రం కొల్లు చేసిన తప్పుని చేయకుండా ముందుకెళుతున్నారు. మంత్రి పదవిని సక్రమంగా నిర్వర్తిస్తూనే, నియోజకవర్గం సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు.
మంత్రి అయినంత మాత్రాన నియోజకవర్గాన్ని గాలి కొదిలేయకుండా పలు అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళుతున్నారు. మంత్రి పదవి వచ్చిన గర్వం చూపించకుండా...ఓ సామాన్యుడులా నియోజకవర్గంలో పర్యటిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల బాగుకోసం పాటుపడుతున్నారు. అటు పేర్ని తనయుడు కూడా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు.
ఇక త్వరలోనే బందరు ప్రజల చిరకాల కోరిక పోర్టు పనులని కూడా మొదలుపెట్టి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తున్నారు. మొత్తం మీద ఆ మాజీ మంత్రి చేసిన తప్పుని పేర్ని చేయకుండా జాగ్రత్తగా ముందుకెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రి కొల్లు రవీంద్ర ఎప్పుడూ మీడియాతో మాట్లాడిన సంగతే ఎవ్వరికి గుర్తు లేదు. బాబు కేబినెట్లో ఆయన ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో పాటు ఇటు నియోజకవర్గ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇప్పుడు నాని ఈ రెండు విషయాల్లో మంచి మార్కులతో ముందుకు వెళుతున్నారు. అటు ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లతో ప్రభుత్వ విజయాలు చెపుతూ.. ప్రతిపక్షాల తీరు ఎండగడుతూ జగన్ కేబినెట్లో స్పెషల్ మినిస్టర్గా ముద్ర వేయించుకున్నారు.