రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ 384 కిలోమీటర్ల పొడవు అలైన్‌మెంట్‌తో అనంతపురం-అమరావతి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని ఖరారు చేసినట్లు  సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. భారత్‌మాల పరియోజనలో భాగమైన గ్రాండ్‌ చాలెంజ్‌ కింద కొత్తగా రహదారి ప్రాజెక్ట్‌లు చేపట్టవలసిందిగా రాష్ట్రాలు కోరవచ్చునని ఆయన తెలిపారు. 

 

   ప్రాజెక్ట్‌లలో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి ఆయా రాష్ట్రాలు ముందుకు వస్తే మిగిలిన వ్యయంతోపాటు ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని కూడా కేంద్రమే  భరిస్తుందని చెప్పారు. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు తమ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. 

 

    ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ, వన్యప్రాణుల శాఖల నుంచి చట్టబద్దమైన అనుమతులను తీసుకునే చర్యలను త్వరితగతిన పూర్తి చేయబోతున్నామని గడ్కరీ చెప్పారు. నిర్మాణ పనులు ఆరంభించడానికి ముందుగా పొందవలసిన చట్టబద్దమైన అనుమతులు, నిధుల లభ్యతను బట్టి ప్రాజెక్ట్‌ పనులను మొదలెడతామని తెలిపారు. 

 

  అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను 12 ప్యాకేజీల కింద చేపట్టేలా డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లో పేర్కొన్నప్పటికీ ఎన్ని ప్యాకేజీల కింద పనులు చేపట్టాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని గడ్కరీ తెలిపారు. 

 

  మార్కెట్‌లో పోటీని తట్టుకోలేక, గిట్టుబాటు కానందునే కొన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎఈ) మూతబడుతున్నాయని చిన్న పరిశ్రమల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. రాజ్యసభలో సోమవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఎంఎస్‌ఎంఈలకు నాణ్యమైన పనిముట్లు, సుశిక్షితులైన మానవ వనరులు సమకూర్చేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌, ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అంశాలపై సలహాలు ఇచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా 18 టెక్నాలజీ సెంటర్లను నిర్వహిస్తోందని అన్నారు.

 

   వీటి ద్వారా ఎంఎస్‌ఎంఈలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టెక్నాలజీ సహాయాన్ని అందిస్తోంది. క్రెడిట్‌ లింక్డ్‌ కాపిటల్‌ సబ్సిడీ అండ్‌ టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌ స్కీం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోంది. ఎంఎస్‌ఎంఈల సామర్థ్యం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని మంత్రి చెప్పారు. రుణ సంబంధ విషయాలు, మౌలిక వసతుల మద్దతు, వ్యాపార దక్షత, టెక్నాలజీ వినియోగం, ప్రపంచ ఆర్థిక, వాణిజ్య రంగాల పని తీరు వంటి అంశాలు ఎంఎస్‌ఎంఈల సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: