వైఎస్ జగన్ సొంత జిల్లా కడప.. ఆ జిల్లాలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. జగన్ సీఎం అయిన తర్వాత జగన్ సొంత జిల్లాపై అందులోనూ సొంత నియోజక వర్గం అభివృద్ధి పై దృష్టి పెట్టారు. తాజాగా ఆయన కడప, పులివెందుల పట్టణాల అభివద్ధిపై సమీక్ష నిర్వహించారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో కడప, పులివెందుల పట్టణాల తలరాత మారిపోయే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

 

కడప, పులివెందుల ఈ రెండు పట్టణాలను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. పైలెట్‌ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ.. పాడా.. నుంచి తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

 

 

సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలోకడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, బ్యూటిఫికేషన్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్‌, గండి టెంపుల్‌ కాంప్లెక్స్‌, ఐఐటీ క్యాంపస్‌, ఎకో పార్క్‌, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఎస్టిమేషన్‌ వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్‌ ఉండాలని అధికారులకు సూచించారు.

 

 

ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని చెప్పారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన అన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పులిచింతలలో వైఎస్సార్‌ ఉద్యానవనం ప్రణాళికను , విశాఖపట్నంలో లుంబినీ పార్క్‌ అభివృద్ధిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే తరహాలో పోలవరం వద్ద కూడా పార్క్‌ రూపొందించాలని అధికారులకు సూచించారు. మరి ఈ ఐదేళ్లలో ఈ రెండు పట్టణాల రూపు రేఖలు ఎలా మారతాయో..?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: