టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరు నెలల్లో ఆరు యూ టర్నులు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు స్వాగతించగానే యూటర్న్‌ తీసుకుంటున్నాడని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

రైతు భరోసా, ఇసుక, ఇంగ్లిష్‌ మీడియం ఇలా ప్రతీది రాజకీయం చేయాలని చూసి యూటర్న్‌ తీసుకున్నాడన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 38 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కొని వాటిని డెవలప్‌ చేయకుండా ఐదు సంవత్సరాలు గొర్రెలు కాశారా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులంతా చంద్రబాబు పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. రూ.4900 కోట్లు ఖర్చు చేసి నాలుగు బిల్డింగ్‌ కట్టాడని, అవి కూడా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయన్నారు.

 

అమరావతి పర్యటనకు వచ్చి రైతులకు ఏం సమాధానం చెబుతావు బాబూ అని నిలదీశారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిగా ఇచ్చే సాయం కేంద్రం డబ్బు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేసిందని, హామీ ఇచ్చినదానికంటే రూ. వెయ్యి అదనంగా ఇవ్వడంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు దాన్ని పక్కకునెట్టారు.

 

 

ఇసుక సమస్య అని రాజకీయం చేయాలని చూశారు. గత ప్రభుత్వం ఇసుకను దోపిడీ చేసిందని, దాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నూతన పాలసీని తీసుకువచ్చారు. వర్షాలు, వరదలు అధికం కావడంతో ఇసుక తీయలేకపోవడంతో ఆ విషయమై ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు కుట్ర చేశారు. వరదలు తగ్గి ఇసుక సరఫరా మెరుగుపడడంతో దాని నుంచి చంద్రబాబు వెనక్కుతగ్గాడని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

 

 

అందరికీ విద్య అందుబాటులోకి రావాలని, సీఎం వైయస్‌ జగన్‌ విద్యలో సంస్కరణలు తీసుకువచ్చారు. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూశారు. ప్రజలంతా ఇంగ్లిష్‌మీడియం విద్యను కోరుకుంటే ఈ అంశంపై కూడా చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ నేతలకు ఇండికేషన్‌ ఇచ్చారని మంత్రి బొత్స గుర్తుచేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: