2019 లో జరిగిన ఎన్నికలో ఘన విజయం సాధించి అవినీతి రహిత పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14400 కాల్‌ సెంటర్‌ను సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్‌ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలు, కాలవ్యవధి, తదితర విషయాల గురించి కాల్‌ సెంటర్‌ ఉద్యోగితో మాట్లాడి తెలుసుకున్నారు. ఫిర్యాదు వచ్చిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దాని పై తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దు అని, కచ్చితంగా నిజాయితీగా పని చేయాలన్నారు ఆయన. వ్యవస్థ పై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు వాటిని పరిష్కరించడంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ టి. విజయ్‌కుమార్‌రెడ్డి, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

 

పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రజలకు నేరుగా సత్వరమే పనులు జరిగేలా  గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లను నియమించింది అని చెప్పారు. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది అని తెలిపారు. ఇప్పటికే ఇసుక అక్రమాలపై 14500 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో తప్పిదాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంది. ఇసుక అక్రమాలను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన విషయం మన అందరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: