ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతున్నాయి. జగన్ ఎన్నికలకు ముందు అవినీతిని అంతం చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే పాలనను పారదర్శకంగా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తులను వెంటనే ఉద్యోగాల నుంచి పంపిస్తున్నారు.
ఇటు మంత్రుల విషయంలో కూడా ఇదే చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేశారు. జగన్ దగ్గర ఇప్పటికే దీనికి సంబంధించిన లిస్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. లిస్ట్ ప్రకారం జగన్ ఎవరిని పక్కన పెట్టబోతున్నారో తెలియడం లేదు. రెండున్నర ఏళ్ల తరువాత కొంతమంది మంత్రులను మారుస్తారని ఇప్పటికే స్పష్టం అయ్యింది. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను ఇప్పటికే నియమించింది ప్రభుత్వం. ఆయా మంత్రులు అక్కడి విషయాలను చూస్తూనే పార్టీ బలంగా ఉండేలా చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాలో వైకాపా విజయం సాధించాలని దానికి కృషి చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కనుక ఎక్కడైనా పార్టీ ఓడిపోతే దాని ప్రభావం ఆ ఇన్ ఛార్జ్ మంత్రిపై పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
గతంలో వైఎస్ హయంలో కూడా ఇలానే జరిగింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ ఓడిపోయింది. ఆంతే, ఆ రెండు జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రుల పోస్టింగులు ఊస్టింగ్ అయ్యాయి. ఇప్పుడు జగన్ కూడా అదే చేయబోతున్నారు. అన్ని జిల్లాల మంత్రులు ఇప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది. అన్ని జిల్లాలో విజయం సాధించాలి అంటే కష్టమే కదా.. మారేలా అంటే అది అంతే.. జరగక్కపోతే ఊస్టింగే.