ముఖ్యమంత్రి వైయస్.జగన్ పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన అనే లక్ష్యాలతో పని చేస్తున్నారు . జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం పేదవారికి లబ్ది చేకూరేలా ఉంటుందన్నది వాస్తవం. ఇందుకు గాను ఎంతో ప్రణాళికబద్దంగా తన పాలనను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రతిపక్షాల మాటల దాడులను తన చేతలతో తిప్పికొడుతున్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అనే మాటను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. దీంతో పాటుగా కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ఐఐఎం అహ్మదాబాద్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇకపోతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వితంతు, ఒంటరి మహిళల పెన్షన్కు అర్హత నిబంధనలను మార్పుచేశారు.
అవేంటంటే వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీ–2 పెన్షన్ వయస్సును 45 ఏళ్లుగా నిర్థారించారు. ఇదే కాకుండా పిల్లలు లేకపోయినా, మైనర్ పిల్లలున్న వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్ లభిస్తుంది. కానీ ఈ కేటగిరీ–2 పెన్షన్ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరీ–1 పెన్షన్కు అర్హులైనా వారికి ఆ పెన్షన్ వర్తించదు. ఇలా కాకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఇదేకాకుండా, కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతిచెంది ఆమెకు వివాహం కాని కుమార్తె ఉంటే పాతికేళ్లు వచ్చి వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్ అందిస్తారు. ఇందుకు గాను వివాహ ధ్రువీకరణకు సంబంధించి రెవెన్యూ శాఖలోని గెజిటెడ్ ఆఫీసర్ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
ఇక పెన్షన్ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే గనుక ఆ కుమార్తె ముందుగానే తన తల్లి మరణానంతరం పెన్షన్ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్పటికి 45 సంవత్సరాల వయస్సులోపే ఇది ఇవ్వ వలసి ఉంటుంది.. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు ఆమెకు పెన్షన్ ఇస్తారు. కాగా, మారిన నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ, పెన్షన్ పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపోతే ఈ విధానం వల్ల పెన్షన్ తీసుకునే మహిళలకు ఎంతగానో లబ్ది చేకూరనుంది.