ఒకసారి దెబ్బ తింటే మళ్ళీ ఆ వైపునకు ఎవరూ వెళ్ళరు. కానీ అదేంటో మన రాజకీయ పార్టీలకు కుర్చీ మీదే యావ పదే పదే వెంటపడేలా చేస్తుంది. దాంతో పరువు తీసుకోవడానికి సైతం రెడీ అయిపోతున్నాయి. బీజేపీ విషయానికి వస్తే కర్నాటక రాష్ట్ర చేదు అనుభవం కళ్ళ ముందు ఉంది. అయినా సరే మహారాష్ట్రలో దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనులు చేపట్టింది.
సుప్రీం కోర్టు తీర్పుతో ఇపుడు కమలానికి దిమ్మ తిరిగి బొమ్మ బొమ్మ కనిపిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే మెజారిటీ నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రొజు ఇచ్చిన తీర్పు కాషాయ పార్టీకి కషాయం తాగించినట్లైంది. కేవలం ఇరవై నాలుగు గంటల్లో మెజార్టీ నిరూపించుకోవడం అంటే బీజేపీకి చాలా కష్టమే.
మరో వైపు నమ్ముకున్న అజిత్ పవార్ మరీ వీక్ గా కనిపిస్తున్నాడు. ఆయన ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలను తీసుకొస్తాడనుకుంటే వచ్చింది పదకొండు మంది, అందులో మళ్ళీ చాలా మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో బీజేపీ ఆశలు గల్లంతు అయ్యాయి. అయినా సరే కొద్ది రోజులు సమయం ఇస్తే చాలు ఎలాగోలా పెద్ద ఎత్తున కొనుగోళ్ళు చేపట్టి మెజారిటీ నిరూపించుకోవచ్చునని బీజేపీ ఆలొచించింది కానీ ఇపుడు సుప్రీం కోర్టు తీర్పుతో సీన్ మొత్తం రివర్స్ అయింది.
ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మెజారిటీ దక్కడం అంటే కష్టమన్న మాట వినిపిసోంది. మరో వైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కూడిన మూడు పార్టీల కూటమికి అచ్చంగా 162 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నిన్ననే వారంతా ముంబై వీధుల్లొ పెద్ద ఎత్తున పెరేడ్ చేశారు. దీంతో అటు గవర్నర్ కి, ఇటు కోర్టుకు, అటు బీజేపీకి, ఇటు సామాన్య ప్రజలకు కూడా సీన్ మొత్తం అర్ధమైపోయింది. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ కి మళ్ళీ ఘోర పరాభవం తప్పదంటున్నారు. కర్నాటక సీన్ రిపీట్ అవడం ఖాయమని కూడా అంటున్నారు.