52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్ టీ సి కార్మికులు తమ సమ్మె ను విరమించి తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపోలకు తరలి వస్తున్నారు. ప్రభుత్వం నుండి ఆర్ టీ సి కార్మికులను విధుల్లోకి చేర్చుకునే విషయంలో ఎలాంటి అనుమతి తమ వద్ద లేనందున పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులను అధికారులు తాత్కాలిక సిబ్బందితో నడిపిస్తున్నారు. కార్మికులు పలు చోట్ల బస్సులు ఆపడంతో పోలిసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆర్ టీ సి ఐకాస నేతలను వారి ఇంటి వద్ద నుండి అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి.
నల్గొండ బస్టాండ్ వద్ద పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. సంగారెడ్డి డిపో వద్ద పోలీసులు పరిస్థితులు అదుపు తప్పకుండ కార్మికులను అరెస్ట్ చేశారు. మహిళా కార్మికులను తిరిగి వెనక్కి పంపించారు. తమకు ఎందుకు ఈ శిక్ష అంటూ మహిళా కార్మికులు వాపోయారు. హన్మకొండ లో కార్మికులను పోలీసులు బలవంతంగా బస్సులలో ఎక్కించి స్టేషన్ కి తరలించారు. మహబూబ్ నగర్ లో పోలీసులు కార్మికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వారిని అదుపులో తీసుకున్నారు. డైట్ కళాశాల మైదానం నుండి కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూల్ లో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది.
కొల్హాపూర్ లో పోలీసులు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేశారు. కల్వకుర్తిలో పోలీసులు, మహిళా కార్మికుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఖమ్మం లోని వివిధ డిపోలలో కూడా పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. అదేవిదంగా మంచిర్యాల, నిర్మల్ లలో కూడా పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు.హైదరాబాద్ పరిధి లోని అన్ని డిపోలలో ఆందోళనలు, అరెస్టులు జరుగుతున్నాయి.