మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా అనంతరం ... అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆదేశించారు . గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారం ఎమ్మెల్యే లంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు . అనంతరం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు . అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ చక, చకా ఏర్పాట్లు చేస్తున్నారు . మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని సూచించగా , ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తమకు సరిపడా ఎమ్మెల్యేల బలం లేదని పేర్కొంటూ , మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు . దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వంలోని ఎన్సీపీ , కాంగ్రెస్ కూటమి సిద్ధమయ్యాయి . ఈ మూడు పార్టీల నేతలు ప్రత్యేకంగా సమావేశమై, తమ నాయకుడిగా ఉద్దవ్ ఠాక్రే ను ఎన్నుకున్నారు . మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు . ఇక ప్రభుత్వ ఏర్పాటుకు తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని కూటమి నేతలు ప్రకటించారు .
ముంబైలోని హయత్ హోటల్ లో మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల చేత పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే. నూతన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు అసెంబ్లీ ప్రోటైం స్పీకర్ బిజెపి ఎమ్మెల్యే, సీనియర్ శాసనసభ్యుడు కాళిదాస్ కొలంబర్కార్ నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రోటైం స్పీకర్ గా సీనియర్ శాసన సభ్యులను నియమించడం ఆనవాయితీగా వస్తోంది, ఇప్పటికే ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కాళిదాస్ ను గవర్నర్ ప్రోటైం స్పీకర్ గా నిర్ణయించడం తో , కొత్తగా ఎన్నికైన సభ్యులచే ఆయన ప్రమాణస్వీకారం చేయించి, బలపరీక్ష నిర్వహించనున్నారు