తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేస్తూ , ఆత్మగౌరవంతో బ్రతకాలనుకున్న ఒక ఆర్టీసీ కార్మికుడు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు . ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు … కదా, కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా ... అనే విధంగా గా తీవ్ర మానసిక వేదనకు గురై తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్యాపేట డిపో కు చెందిన కండక్టర్ లూనావత్ కృష్ణ నాయక్ చెప్పారు .
కేసీఆర్ కు మాట తప్పడం, మాయమాటలతో మోసం చేయడం తెలుసునని ఆర్టీసీ కార్మికులు ఆలస్యంగా తెలుసుకున్నారన్న కృష్ణ నాయక్ , తనని ఆర్టీసీ యాజమాన్యం , ప్రభుత్వమో ఉద్యోగం లో నుండి తీసేయడం కాదని , తానే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు . తెలంగాణ లో నియంతృత్వ పాలనా చూస్తానని అనుకోలేదని, 1200 మంది యువతి , యువకులు , సబ్బండ వర్గాల ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు . ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమోనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడుతాయని అనుకున్నానని , కానీ కేసీఆర్ అది తప్పని నిరూపించారన్నారు . ఆర్టీసీ కార్మికులు 30 మంది చనిపోతే కనీసం స్పందించలేదని మండిపడ్డారు .
తెలంగాణ సామాన్యుల కోసం కాదని , రాజకీయ నాయకుల కోసమే ఏర్పడిందని కృష్ణ నాయక్ అన్నారు . తాను సూర్యాపేట డిపో లో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నానని, ఒక మోసకారి ఒక మాటకారి ఒక మానవత్వం లేని ... నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేనని అందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు . గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని , తన ఉద్యోగానికి చేసిన రాజీనామా ను తక్షణమే ఆమోదించాలని కృష్ణ నాయక్ కోరారు .