తన రాజకీయ ప్రత్యర్థులను...ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమాత్రం నిరాశపర్చలేదు! తన స్వార్థానికి అనుగుణంగా రాజకీయాలో చేయడంలో నేర్పరి అని...రంగులు మార్చడంలో ఊసరవెల్లితో పోటీ పడేలా ఆయన రాజకీయం ఉంటుందని...అవసరానికి తగ్గట్లు ఎవరితో అయినా కలిసిపోగలరు...విబేధించగలరు అని చంద్రబాబు ప్రత్యర్థులు ఆయనపై చేసే విమర్శలను నిజం చేసేశారు!! కేంద్రంలో అధికారంతో ఉన్న బీజేపీకి దగ్గరయ్యేందుకు తెగ తాపత్రయపడుతున్న చంద్రబాబు తాజాగా మళ్లీ రంగు మార్చారు!!!
బీజేపీతో తాము ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు సరికాదని పార్టీ నేతలకు చెప్పి... కమలనాథుల పట్ల స్టాండ్ మార్చి చంద్రబాబు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడల్లా అలా బీజేపీ నేతలను ఆయన దువ్వుతూనే ఉన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కేంద్రంగా గుర్తించకపోవడం...దీనిపై దుమారం రేగడం... కొన్ని రోజుల క్రితం విడుదలైన మ్యాపుల్లోను అమరావతిని ఏపీ రాజధానిగా ప్రస్తావించడం తెలిసిన సంగతే. ఈ సమయంలోనే అమిత్షాను కాకాపడుతూ...ఆయనకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, అది సరిపోదన్నట్లు....తన ట్వీట్ను అమిత్షా చూశాడో లేదో అన్న సందేహంతో...ఎంపీలతో రాయబారం నడిపించారు. కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్షాను టీడీపీ లోక్సభ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, మరో ఇద్దరు కలిశారు. తాజాగా విడుదల చేసిన దేశ చిత్రపటంలో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించినందుకు కృతజ్ఞతలు చెప్పారు!
ఈ తర్వాత ఎంపీలు బాబును మించిన కామెంట్లు చేశారు. అమిత్షాతో భేటీ అయిన టీడీపీ నేతలు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించామని మీడియాకు తెలిపారు. తద్వారా తమతో అమిత్షా మాట్లాడారని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కాగా, ఇప్పటికే బీజేపీ నేతలు చంద్రబాబును తమ దరికి రానిచ్చేది లేదని ఖరాఖండీగా ప్రకటనలు చేశారు. రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు శాశ్వతంగా బిజెపి డోర్లు మూసుకుపోయాయని వ్యాఖ్యానించారు. అయినా బాబుగారి దింపుడు కల్లెం ఆశ తగ్గడం లేదు. ఊసరవెల్లిలా రంగులు మార్చడం వదలుకోవడం లేదు.