తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని ప్రస్తుత రాజకీయం వరకూ పవన్ ప్రస్తావించారు. అయితే, ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఆయన రాష్ట్రాన్ని విడదీసే ఉద్యమం చేశారని చెప్పలేదు. ఇక ఆయన కూతురు, మాజీ ఎంపీ కవిత పేరును సైతం పవన్ తన సుదీర్ఘ, సవివర విశ్లేషణలో టచ్ చేయలేదు.
భారతదేశంలోని వివిధ అంశాల గురించి పవన్ విశ్లేషించారు. ``నాలుగు గోడల మధ్య మాట్లాడే మాటలు రెండుమూడు దశాబ్దాల తరవాత ఉద్యమాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. దానికి ఉదాహరణే తెలంగాణ ఉద్యమం. 1969 , 70 ల్లోనే మేము కలసి ఉండలేం అన్నప్పుడు ఆ అంతరాలను సరి చేయలేదు. నాలుగు గోడల మధ్య మాటలుగా వదిలేశారు. మూడు దశాబ్దాల తరవాత ఉద్యమం అయింది. ప్రత్యేక రాష్ట్రమైంది. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక- ఒక తెలంగాణ మహిళా ఎంపీ కశ్మీర్ తోపాటు తెలంగాణ కూడా భారత యూనియన్ లో బలవంతంగా కలుపబడ్డాయి అన్నారు. ఎంత గగ్గోలు అయిందో మనందరికీ తెలుసు.`` అని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రసత్ఉత తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి లేదా...పార్లమెంటు వేదికగా మాట్లాడిన ఆయన తనయ కవిత గురించి పవన్ పేరు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన తనయను గౌరవించారా? వారి ప్రస్తావన తేవడం ఎందుకని పవన్ భయపడ్డారా అనే చర్చ జరుగుతోంది.
కాగా, భారతదేశపు మూలాలైన మన భాష, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. `` మన ప్రాంతీయ నాయకులకు మన సంస్కృతి, భాషలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. తెలిసీ తెలియకుండా మన భాషకు, సంస్కృతికీ నష్టం కలిగిస్తే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. మాతృ భాష మూలాలను రేపటి తరానికి తెలీకుండా చేయడం ద్వారా దేశంలో భాష, సంస్కృతుల విశిష్టతకీ, సనాతన ధర్మ పవిత్రతకీ నష్టం కలిగిస్తున్నారు. ఏ సంస్కృతి ఏ సంప్రదాయాలు, ఏ భాష పునాదులపై దేశం నిలబడిందో ఆ సమగ్రతను ఉత్తర, దక్షిణ వైరుధ్యాలతో విచ్చిన్నం చేస్తారు.`` అని ఆయన హెచ్చరించారు.