దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఘాటెక్కాయి.. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జాతీయంగా ఏర్పడిన ఉల్లి కొరత పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉల్లి ధరలు మరింత ప్రియమయ్యాయి. బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.100కు వ్యాపారులు విక్రయిస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిణామాల్లో విశాఖ పట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అపరా దాన కర్ణుడిలా కనిపిస్తున్నారు అక్కడి ప్రజలకు. బహిరంగ మార్కెట్లో రూ.100కు కిలో ఉల్లి పాయలు కొనుగోలు చేసి ఆయన కిలోకు రూ .25 కి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీంతో పలువురు అక్కడ ఉల్లి కొనేందుకు ఎగబడుతున్నారు.
రోజూ 300 కుటుంబాలకు సబ్సిడీ రేట్లతో అందిస్తున్నారు. తాను రైతు బజార్లలో సబ్సిడీ రేట్లతో లభించే పరిమాణం వినియోగదారులకు సరిపోని కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇది చిన్న సహకారమే అయినప్పటికీ పేద వాళ్ళకోసం తనవంతు సహాయం అని గణేష్ కుమార్ చెబుతున్నారు,. సబ్సిడీ ఉల్లిపాయలను కింగ్ జార్జ్ హాస్పిటల్ కు సమీపంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు . ఇదిలా ఉండగా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికి అందులో కొన్ని షరతులతో కిలో మాత్రమే అందేజేస్తున్నారు. కిలో రూ.30కి విక్రయాలు జరుపుతున్నారు.
ఇప్పట్లో ఉల్లి సంక్షోభం తీరేలా కనబడటం లేదని సమాచారం. మహారాష్ట్ర నుంచే దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి ఉంటుంది. వరుస వర్షాలతో ఉల్లి దిగుమతి తగ్గడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరో నెల రోజుల పాటు ఉల్లి పంట చేతికొచ్చే పరిస్థతి లేకపోవడంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోతుంటాయని వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న ఉల్లినే ప్రస్తుతం మార్కెట్లో అభిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులు ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఉల్లిని పొదుపుగా వాడుకోవడం ఒక్కటే మార్గమని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం.