అమరావతి రైతుల నుంచి సానుభూతి పొందాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురవుతోంది. రాజధానిలో పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆయనకు రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఇక్కడి రైతులకు ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయకపోవడంతో చంద్రబాబును కడిగేస్తున్నారు. కొంతమంది రైతులతే ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏం మొహం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తున్నావు అంటూ పేర్కొనడం గమనార్హం. రాజధాని ఏర్పాటు మా భూములు లాక్కుని మమ్మల్ని రోడ్డున పాడేశావు. నీ స్వార్థ రాజకీయం కోసం మమ్మల్ని బలిపశువులను చేశావు..మా బతుకులతో ఆడుకున్నావు అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబడుతున్నారు.
‘రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపించి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? ఇలా మోసం చేసినందుకు చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో చంద్రబాబు అడుగుపెట్టాలి’ అంటూ ఫెక్సీల్లో రైతులు నిలదీశారు. ఇక మాకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటైన నెరవేర్చావా..? అంటూ ప్రశ్నించారు. ‘ రాజధాని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న హామీని ఎందుకు అమలుచేయలేదు? గ్రామకంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదంటూ ఒక్కోటిని గుర్తు చేస్తున్నారు. ఇక మా బిడ్డల బతుకులు బాగుపడతాయి అంటేనే కదా..నువ్వు చెప్పినట్లు చేశాం.
వారికి ఉపాధి కల్పిస్తావు అన్నవు... ఉపాధి కోసం రూ. 25లక్షల వడ్డీలేని రుణం అందజేస్తా అన్నావు... నీ ఐదేళ్ల కాలంలో ఏనాడు ఇవి చేయలనిపించలేదా..? అయ్యా అంటూనే చంద్రబాబు పాలనను ఫ్లెక్సీల్లో ఎండగట్టడం గమనార్హం. రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయి? మూడేళ్లలో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? జీవో 41తో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న దళితులకు అన్యాయం చేశారు. పట్టా భూములకు ఒక ప్యాకేజీ.. దళితుల అసైన్డ్ భూములకు మరో ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు? అంటూ చంద్రబాబు ప్రతీ వైఫల్యాన్ని ఎండగడుతుండటంతో టీడీపీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి.
టీడీపీ అధినేతకు ఇది ఊహించని ట్విస్టని...రాజధాని రైతుల్లో ఈ స్థాయిలో నిరసన గూడు కట్టుకుని ఉందని పార్టీ వర్గాలు కూడా ఊహించలేదని తెలుస్తోంది. చంద్రబాబు తమకు ద్రోహం చేశారని రైతులంతా ముక్తకంఠంతో నినదిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత పర్యటనకు ఆదరణ విషయం పక్కన పెడితే పరువు పోకుండా మమ అనిపించాలనే వ్యూహంతో ఇప్పుడు పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారట. చూడాలి ఏం జరుగుతుందో..!