చంద్రబాబు మా బతుకులు నాశనం చేశాడంటూ అమరావతి రైతులు శాంతియుతంగా చేపట్టిన దీక్ష ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఈ దీక్షపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఒకరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రబాబు అన్యాయాలను ప్రశ్నిస్తే ఎందుకు ఆ పార్టీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నారంటూ రైతులు భగ్గమన్నారు. చంద్రబాబు మాకు అన్యాయం చేయలేదని ఆయన ఆత్మసాక్షిగా వెల్లడించాలని రైతులు నిరసనకు దిగారు. రాజధానికి చంద్రబాబు చేరుకోగానే పెద్ద ఎత్తున రైతులు నిరసన ప్రదర్శనతో వెళ్లి అడ్డుకున్నారు. ఈసందర్భంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు రైతులపై పిడిగుద్దుల కురిపించారు. రాళ్లతో దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు తన పర్యటనకు టీడీపీ కార్యకర్తలకన్నా గుంటూరు, విజయవాడ నుంచి రౌడీలను, గుండాలను వెంటబెట్టుకుని వచ్చారని రైతులు ఆరోపించారు.ఆయనతో పాటు ఉన్న నాయకుల్లో అనేక మంది ఇసుక, మైనింగ్ మాఫియా వారేనని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని..అన్నారు. రైతులను వంచించిన ఏ ప్రభుత్వం.. ఏ పాలకుడు బాగుపడడని శాపనార్థాలు పెట్టారు. తమ పిల్లల భవిష్యత్ను పణంగా పెట్టి భూములు అప్పగిస్తే చివరికి మాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తన ఆస్తులు సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసి వెళ్లడానికి పర్యటనతో రాజధానికి వస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు కాలంలో రైతులను ఏనాడు నిరసన వ్యక్తం చేయనీయకుండా పోలీసులతో నిర్బంధ పాలన సాగించారని వాపోయారు.అయితే, తమ నుంచి సేకరించిన భూములకు బదులుగా కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకపోవడంతో తమ జీవితాలు రోడ్డునపడ్డాయని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అనే నినాదాలతో అమరావతి ధ్వనించింది. రైతులకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించవద్దంటూ ఆందోళన చేపట్టారు. సాధారణంగా అధికార పక్షంలో ఉన్న నేతలకు నిరసనలు ఎదురవడం సహజం. కానీ విపక్షంలో ఉన్న నేతకు ప్రజలు నిరసన తెలపడం బహుశా ఆంధ్రా రాష్ట్ర రాజకీయాల్లోనే అరుదైన సంఘటనగా రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.