హైదరాబాద్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. అతివేగం, మీతిమీరిన నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. ఐదు రోజుల వ్యవధిలో నలుగురు చనిపోయారు. మరికొందరు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగే కారణం.
హైదరాబాద్ వాసులను వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నవంబర్ 23న, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు పల్టీకొట్టి మహిళ మృతి చెందింది నవంబర్ 26న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఆర్టీసీ బస్ తాత్కాలిక డ్రైవర్ అతివేగానికి ఓ మహిళ ప్రాణాలు విడిచిపోయింది. ఈ ప్రమాదాలను మరిచిపోకముందే హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. దిల్సుఖ్ నగర్ -ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన కారు ఇద్దరు మహిళలపై దూసుకెళ్లింది. రోడ్డుదాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టి ...పల్టీలు కొట్టి మెట్రో పిల్లర్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటమ్మ, సత్తెమ్మ అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉంది.
ఇటు... కూకట్పల్లిలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. వసంతనగర్ సమీపంలో అతివేగంగా వెళ్తున్న లారీ..టూవీలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కూకట్పల్లి ప్రమాదం జరిగిన కొద్దినిమిషాలకే ఇటు కుషాయిగూడలో మరో ప్రమాదం జరిగింది. కాప్రా నుంచి స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే చనిపోయింది. లారీడ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు ఇటు సిద్ధిపేటలో నటుడు సంపూర్ణేష్బాబు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు సంపూర్ణేష్ కారును ఢీకొట్టింది. అయితే స్వల్పగాయాలతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వరుస రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అతివేగం ప్రమాదకరమని.. ప్రభుత్వం.. అటు స్వచ్ఛంద సంస్థలు ఎంత వారిస్తున్నా.. వాహనాలను స్పీడ్ గా డ్రైవ్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. వాళ్లు ప్రమాద భారిన పడింది కాక.. రోడ్డుపై వెళ్తున్న అమాయుకుల ప్రాణాలను హరించేస్తున్నారు.