చదువుల తల్లి క్షేత్రం బాసరలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది దేవదాయశాఖ. అమ్మవారి ఆస్తుల, ఆదాయంపై కన్నేసిన వారి ఆటకట్టించడానికి పూనుకుంది. ఇప్పటికే ఏఈఓపై సస్పెన్షన్ వేటు పడగా.. ఛైర్మన్పై కొరడా ఝళిపించేందుకు రెడీ అయింది. అక్రమార్కులు మింగిన ఆదాయం కక్కిస్తారా..? లేదా ఒత్తిళ్లకు తలొగ్గుతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయం ప్రక్షాళనకు దేవాదాయశాఖ ప్రత్యేక దృష్టి సారిచింది. దశాబ్దకాలంగా ఆలయంలో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన కొంతమంది బాగోతాలు వెలుగులోకి రావడంతో చర్యలకు ఉపక్రమించారు ఉన్నాతాధికారులు. ఈఓలను డమ్మీగా చేసిన ఓ అధికారిపై వేటు వేయడానికి సర్వం సిద్దం చేశారు.
సరస్వతీ అమ్మవారి దేవాలయంలో అక్రమార్కులు దేన్ని వదిలిపెట్టలేదు. మరమత్తులు,సిబ్బంది, కొనుగోళ్లు, ఆఖరికి అమ్మవారి ప్రసాదాల తయారిలో సైతం చేతివాటం ప్రదర్శించారు. చేసిన ఖర్చులేకే కాకుండా చేయని వాటికి నకీలీ బిల్లులు సృష్టించి మింగేశారు. గుడికి రంగు వేయించడం, వీఐపీల దర్శనం పేరిట లక్షల రూపాయలను దిగమింగారు. అమ్మవారి భూములను కౌలుకిచ్చి ఆ డబ్బులు సొంతానికి వాడేసుకున్నారు అక్రమార్కులు. ఈ విషయం ఇటీవలే బట్టబయలైంది. దీంతో దేవదాయశాఖ ఉన్నాతాధికారులు ఇప్పుడు చర్యలకు దిగుతున్నారు.
అమ్మవారి ఆలయంలో అక్రమాలపై, కుటుంబ పాలన అరచాకాలపై పలు ఛానెళ్లు వరుస కథనాలు ప్రసారం చేయడంతో దేవాదాయ శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అక్రమాలపై కమిటీ వేసి విచారణ చేయించింది. రిపోర్ట్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా రెండు కోట్ల రూపాయలను అక్రమార్కులు పక్కదారి పట్టించారని రిపోర్ట్లో తేలింది. దీంతో ఆలయ ధర్మకర్త, ఛైర్మన్గా సాగుతున్న శరత్ పాఠక్పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. అయితే గతంలోనూ అక్రమాలు చేసిన ఈఓలకు నోటిసులివ్వడం, వారిపై వేటు వేయడం జరిగాయి. అయితే కేవలం సస్పెండ్ చేయకుండా ఇలాంటి వారిని పూర్తిగా విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. అక్రమార్కులకు చెక్ పెడుతున్న దేవదాయశాఖ దిగమింగిన సొమ్మును కక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులను బదిలీ చేసి అక్రమాలకు తావులేకుండా అమ్మవారి క్షేత్రాన్ని ప్రక్షాళన చెయ్యాలి. ఆ దిశగా ప్రభుత్వం, దేవాదాయశాఖ అడుగులేస్తాయని ఆశిస్తున్నారు అమ్మవారి భక్తులు.