తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు కేబినెట్ సమావేశంలో...తన టీంకు కేసీఆర్ ట్విస్టిచ్చారని సమాచారం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి, సమస్యకు ముగింపు పలికే దిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ, రవాణా పరిస్థితులు, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తన మంత్రులకు షాకిచ్చినట్లు సమాచారం.
ఆర్టీసీపై సుదీర్ఘంగా చర్చించేందుకు మధ్యాహ్నం రెండుగంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం మొదలయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి, సమస్యకు ముగింపు పలికేదిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఏ విధంగా ముందుకు పోదామని తన మంత్రివర్గ సహచరులను అడిగినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన ఎలా ఉంది? ఆర్టీసీ కార్మికుల మద్దతుగా ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారా? అంటూ గులాబీ దళపతి ఆరాతీసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఈ ప్రశ్నతో...ఏ విధంగా స్పందించాలో తెలియని స్థితికి మంత్రులు చేరినట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలియజేడం ద్వారా తాము ఆయన దృష్టిలో శత్రువులం అయిపోతామా? ఒకవేళ తాము సలహా ఇస్తే ఆయన పాటిస్తారా? కనీసం స్వీకరిస్తారా అనే స్పష్టత లేకపోవడంతో...మంత్రులు సైలెంట్ అయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్టుకు పంపొద్దన్న ఆలోచనకు సర్కారు వచ్చినట్టు సమాచారం. లేబర్ కోర్టుకు పంపాలంటే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని, కోర్టులో వాద, ప్రతివాదాలు విచారణకు ఐదారు నెలలకుపైగా టైం పడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానివల్ల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, అటు ప్రైవేటు బస్సులు, రూట్ల డీనోటిఫై, ప్రైవేటుకు అప్పగించడం వంటి నిర్ణయాల అమలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్లో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి.