ఏపీలో తెలుగు దేశం పార్టీ నూతన కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో చేపట్టిన నిర్మాణంలోని కొంత భాగం పూర్తి కావచ్చింది. డిసెంబర్ 6న కార్యాలయ ప్రారంభానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మూడు బ్లాకులుగా సౌకర్యవంతంగా కార్యాలయం డిజైన్ చేశారు. ముందుగా ఒక బ్లాక్ ను సిద్దం చేసి...పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ నుంచి నిర్వహించున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో టీడీపీ ఈ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణాలు చేపట్టింది.
ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయం ప్రారంభానికి రెడీ అవుతోంది. మంగళగిరిలో రెండేళ్ల క్రితం మొదలు పెట్టిన నిర్మాణం ఓ కొలిక్కి వస్తోంది. మొత్తం రెండున్నర లక్షల ఘనపుటడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు జరుపుతున్నారు. అయితే మొత్తం భవనం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో...ముందుగా ఒక బ్లాక్ ను సిద్ధం చేసి ప్రారంభోత్సవం చేస్తున్నారు. మంగళగిరి హైవేను ఆనుకుని, ఆత్మకూరు గ్రామ పరిధిలో జరుగుతున్న ఈ నిర్మాణాన్ని డిసెంబర్ ఆరవ తేదీ ఉదయం 10 గంటల మూడు నిముషాల ముహూర్త సమయంలో ప్రారంభిచనున్నారు.
ఏపీలో ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీకి పార్టీ ఆఫీస్ రూపంలో పెద్ద కష్టం వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అన్ని కార్యక్రమాలు ఇంట్లోనో, ప్రజావేదికలోనో నిర్వహించే వారు. అధికారిక లేదా పార్టీ కార్యక్రమాలు, మీటింగ్ లు సచివాలయంలోనో, ప్రజావేదికలోనే జరిగేవి. అయితే ఎన్నికల్లో ఫలితాల తరువాత టీడీపీ కార్యాలయ అవసరాన్ని గుర్తించింది. అప్పటికే మంగళగిరిలో చేపట్టిన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రజావేదిక ఇవ్వాలని కోరినా ప్రభుత్వం తిరస్కరించడంతో పాటు.... కూల్చివేసింది. దీంతో గుంటూరు లోని పార్టీ కార్యాలయం నుంచే చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్కబెడతున్నారు. స్ధలాభావం, రాకపోకలకు ఇబ్బందులు ఉన్నా...వేరే అవకాశం లేక చంద్రబాబు అక్కడికే వెళుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల నుంచి నేతలు గుంటూరు పార్టీ కార్యాలయానికి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని వేగవంతం చేశారు.
పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తెలుగు దేశం ప్రభుత్వ హయాంలోనే లీజు ప్రాతిపదికన స్ధలం కేటాయించింది. మూడు బ్లాకులుగా, అండర్ గ్రౌండ్ మీటింగ్ హాల్స్ ఉండేలా అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ముందుగా 75 వేల ఎస్ ఎఫ్ టితో మొదటి బ్లాక్ ను సిద్ధం చేశారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడు అంతస్థులు ఉంటాయి. వాస్తు ప్రకారం చిన్నపాటి లోపం కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకొని నిర్మాణం పూర్తి చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి హైదరాబాద్ లో ఉన్న కార్యాలయం ఆ పార్టీ అవసరాలకు అనుగుణంగా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత కొంత కాలం అక్కడినుంచే పార్టీ వ్యవహరాలు నడిపించారు. తరువాత గుంటూరు పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. అది సౌకర్యవంతంగా లేకపోవడంతో మంగళగిరిలో ఈ ప్రధాన కార్యాలయం నిర్మాణం చేపట్టారు. హైవేను ఆనుకుని ఉండడం, విజయవాడ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాకపోకలకు కూడా సౌకర్యంగా ఉంటుదని నేతలు చెపుతున్నారు.