జగన్ తో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో పలువురు మంత్రులు .. ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మంత్రులైన తమను ఎవరు లెక్కచేయడం లేదని కొంత మంది జగన్ వద్ద వాపోయారు. ఇక కొంతమంది అధికారుల తీరు కూడా అదే విధంగా ఉందని చెప్పుకొచ్చారట. ఇలా అయితే కష్టమని.. ప్రభుత్వం దీనికి ఏదో రోజూ నిందలు పడాల్సి వస్తుందని ఫిర్యాదు చేశారట. ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్లో మద్యం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై మంత్రులు, జగన్ సమీక్షించారని సమాచారం. మంత్రులు ప్రస్తావించిన అంశాలపై జగన్ కూడా వివరణ ఇచ్చారని సమాచారం.
ఎవరు ఏ తప్పు చేసినా నాకు మొత్తం తెలిసిపోతుందని జగన్ చెప్పినట్టు సమాచారం. ముందుగా ఎమ్మెల్యేలు ఆగడాలు శ్రుతిమించి పోతున్నాయని మంత్రులు చేసిన వ్యాఖ్యలకు.. నాకు అంతా తెలుసునని... ఎవరేం చేస్తున్నారు.. ఎక్కడ చేస్తున్నారు.. తనకు ప్రతీది రిపోర్టు ఉందని, సదరు ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని మంత్రుల సమక్షంలో వ్యాఖ్యనించడం గమనార్హం. ఇక మంత్రులపై కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో ఫిర్యాదు చేసిన దరిమిలా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడం ఇటు వైసీపీలో అటు మొత్తం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
దీనిని జగన్ సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దితే మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సొంత పార్టీలోనే విబేధాలు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బార్ అండ్ రెస్టారెట్లలో మద్యం ధరలను కొంచెం తగ్గించాలని, పర్యాటక రంగంపై ఇది ప్రభావం చూపుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పే ప్రయత్నం చేయగా జగన్ అడ్డుకున్నారు. ప్రదేశాలను చూడట్టానికి వచ్చి తాగుతూ కూర్చోరని చెప్పారట. అయితే మీరంటే శ్రీరామచంద్రులు .. మా లాంటి వారి గురించి ఆలోచించాలి అనగా.. మీరు కూడా శ్రీరామ చంద్రులు కావాలని కోరుకుంటూనని చెప్పడంతో అక్కడ నవ్వులు విరబూశాయట.