అసలు ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో జగన్ సర్కార్ కొలువు తీరింది. అలా ఇలా కాకుండా బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి కుర్చీని జగన్ పట్టేశారు. ఇక ఏపీలో విపక్షంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి దారుణమైన పరాజయం దక్కింది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గట్టి దెబ్బ తగిలింది. అయినా చంద్రబాబు బస్తీ మే సవాల్ అంటున్నారు. జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచే ఆయన గద్దిస్తున్నారు, గర్జిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో స్థానిక ఎన్నికలు తొందరగా నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి విధితమే. గత మూడేళ్ళుగా ఎన్నికలు లేవు. దాంతో అన్ని చోట్లా ప్రజా పాతినిధ్యం లేదు, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు సైతం రాకుండా పోతున్నాయి.
ఈ నేపధ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిధ్ధం చేస్తోంది. మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరపాలనుకుంటోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. ఆ తరువాత మండలాలు, జిలా పరిషత్తుల ఎన్నికలు ఉంటాయి. మూడవ విడతలో మునిసిపాలిటీకి ఎన్నికలు ఉంటాయి.
ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికలు మార్చి లోగా నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండవ వారంలో జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 2019 మే 20న ప్రచురించిన తుది ఓటర్ల జాబితానే పంచాయతీ ఎన్నికలకు వినియోగించనున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా పల్లెల్లో పోరాటానికి రంగం సిధ్ధం కావడంతో వైసీపీ బంపర్ విక్టరీ సీన్ రిపీట్ చేస్తుందా, లేక టీడీపీ బలపడుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా మరో మారు ఏపీలో ఎన్నికలు అంటే రాజకీయ పార్టీల మధ్య సంకుల సమరమే అంటున్నారు. తొడ కొడుతున్న వీరులలో
విజేత ఎవరో తేలాల్సివుంది.