తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పదవుల నియామకాల్లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టంలో అవసరమైన మార్పులు తీసుకువచ్చి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు వీలుగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. పలువురు ప్రజాప్రతినిధులను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉంటూ మరో పదవి చేపట్టడం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుందని అప్పట్లో విపక్ష పార్టీల నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పార్లమెంటరీ సెక్రటరీ నియామకాలను హైకోర్టు రద్దు చేసింది .ఇటు ఎమ్మెల్యేలకు .. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుందని విపక్షనేతలు కోర్టును ఆశ్రయించారు . నామినేటెడ్ పోస్టుల భర్తీకి నిబంధనలు అడ్డువస్తుండడంతో .. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. చట్టం లో అవసరమైన మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.
మూసీ రివర్ ఫ్రంట్, రైతు సమన్వయ సమితి లాంటి ముఖ్యమైన కార్పోరేషన్లు దాదాపు 28 వరకు ఉన్నాయి. .వీటికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నియమించాలంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ప్రతిబంధకంగా ఉంది. ప్రస్తుతం తీసుకురానున్న ఆర్డినెన్స్ తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిరభ్యంతరంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులలో నియమించవచ్చు. మంత్రి వర్గ విస్తరణ సమయంలోనే 10 మందికిపైగా ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టంలో అవసరమైన మార్పులు తీసుకునేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ప్రతిబంధకాలు తొలిగిపోనుండడంతో నామినేటెడ్ పదవుల భర్తీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయం.. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తీపి కబురు అందించినట్టయింది. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు మరికొన్ని పదవులు అనుభవించేందుకు వారికి మార్గం సుగమం అయినట్టయింది.