గత ఏడాది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర కొనసాగుతుంది. తెలంగాణలో గత ఏడాది అక్టోబర్ లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి తెలంగాణ, ఏపీలో ఎన్నికలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక వరకు ఈ ఎన్నికల కోలాహలం నడుస్తూనే ఉంది. ఇప్పుడే వరుస ఎన్నికల నుంచి రాష్ట్రాలకు కాస్త విరామం వచ్చింది అనుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణలో వచ్చే సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామానికి తెరలేవనుంది.
స్థానిక సంస్థల్లో విజయం సాధించటం ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డికి అగ్నిపరీక్షగా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. పురపాలక సంఘాల్లో వార్డుల విభజన సరిగా జరగడం లేదంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా.. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునిసిపల్ ఎన్నికలపై ఉన్న స్టేను ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇక తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలకు జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు దీనిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వభించాలని కోర్టు సూచించింది. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. వీటితో పాటు మరో ఏడు మునిసిపాల్టీలు వదిలేస్తే మొత్తం రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక ఏపీలోనూ సంక్రాంతి తర్వాత వరుస పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పార్డీ నాయకులు, మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా జనవరి 9న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో డేట్లు ఖరారు చేసేలా జగన్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా పంచాయతీలు ఆ వెంటనే సొసైటీలు, మండల, జడ్పీటీసీలు, మునిసిపాల్టీలు, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.