చంద్రబాబుకు ఎస్సీలంటే విపరీతమైన చిన్నచూపని ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు చాలాసార్లు ఆరోపించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని.. గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తుంటారు. ఇప్పడు మరో నేత అలాంటి విమర్శలే చంద్రబాబుపై చేశారు. అమరావతి ప్రాంతంలోని దళితులకు తీరని అన్యాయం చేశారంటున్నారు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రైతులను మభ్యపెట్టి భూములు తీసుకున్న చంద్రబాబు ప్యాకేజీల్లో కూడా తేడా చూపించారంటున్నారామె.

 

దళితులు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత చిన్న చూపో భూములకు ఇచ్చే ప్యాకేజీలోనే అర్థమైందన్నారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. చంద్రబాబు దళిత ద్రోహి అని అందరికీ తెలుసన్నారు. ఐదేళ్లలో అమరావతిని భ్రమరావతిగా మార్చాడు తప్పితే.. చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇడ్లీ పాత్ర లాంటి నమూనాతో రాజధానిని చూపించి మభ్యపెట్టారని అన్నారు. బీడు బారిన భూములు తప్ప రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.

 

చంద్రబాబు మూలంగా రాజధాని ప్రాంత రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు. అమరావతికి వచ్చిన చంద్రబాబు సాష్టాంగ నమస్కారం పెట్టేముందు అంబేడ్కర్‌ స్మృతివనంకు ఎందుకు వెళ్లలేదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను డైవర్ట్‌ చేయడానికి గతంలో అంబేడ్కర్‌ స్మృతివనం అని తీసుకువచ్చాడని, 120 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం అభివృద్ధి ఏమయ్యాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిలదీశారు.

 

సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియలెస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చాడని, రైతులను, నిరుద్యోగులను, మహిళలను అందరినీ మోసం చేశాడన్నారు. ఆక్రోశంతో ఉన్న ప్రజలు చంద్రబాబు పర్యటనకు నల్ల జెండాలతో నిరసన తెలిపారన్నారు. ఏం చూసేందుకు అమరావతికి వచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం అయినా కట్టారా అని ప్రశ్నించారు. వర్షం వస్తే నీరు లోపలికి వచ్చే అసెంబ్లీ, సచివాలయాలను చంద్రబాబు నిర్మించాడన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: