ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా దారుణ‌మైన హ‌త్య‌ల ప‌రంప‌ర‌తో హైద‌రాబాద్‌ శంషాబాద్ వార్త‌ల్లో నిలుస్తోంది. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యా ఉదంతం అంద‌రినీ క‌న్నీరు పెట్టించ‌డంతో పాటుగా ఒళ్లు గ‌గుర్పాటు పుట్టించ‌గా...అదే రీతిలో మ‌రో మ‌హిళ శంషాబాద్‌లోనే శ‌వ‌మై క‌నిపించింది. శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని సిద్ధులగుట్ట రోడ్డులో ఓ మ‌హిళ మృత‌దేహం దారుణంగా త‌గ‌ల‌బ‌డి ఉండ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఆమె వ‌య‌సు దాదాపు 35 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే కలకలం రేపుతున్న ఈ స్త్రీ మ‌ర‌ణం ఎవ‌రైనా చేసిన ఘాతుకమా లేదా ఇంకేదైనా కార‌ణాలు ఉండి ఉంటాయా? అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

 

తాజా స‌మాచారం ప్ర‌కారం, సిద్ధుల గుట్ట దేవాలయానికి పూజ చేసుకునేందుకు స్థానిక అయ్యప్ప స్వాములు విచ్చేశారు. అయితే, ఈ స‌మ‌యంలో  దేవాలయం స‌మీపంలో మహిళ మృతదేహం ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. దీంతో స్థానిక పోలీసుల‌కు అయ్యప్ప స్వాములు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటలు మధ్యలో ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.

 

ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు సిద్దలగుట్ట దేవాలయం వద్ద నిర్మానుష్య ప్రదేశంలో 35 ఏళ్ల మహిళ మృత‌దేహం కాలిపోయిన స్థితిలో ల‌భించిన ఉదంతంలో హత్య జ‌రిగిందా? ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతురాలు చెప్పులు, బట్టలు  క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది.  టెక్నీకల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్థానికుల నుంచి వివ‌రాలు ఆరాతీస్తున్న‌ట్లు తెలుస్తోంది.  మృతదేహాన్ని పోలీసులు 108లో ఉస్మానియాకి తరలించారు. మరి కొద్దిసేపటిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వయుంచునున్నారు. కాగా, వైద్యురాలు ప్రియాంకరెడ్డి ఘటనపై పోలీసులు ప్రెస్ మీట్ ముగిసిన కొద్దీ నిమిషాల్లోనే మరో మహిళ అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల‌కు స‌వాలుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: