శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తోన్న వాహనం రోడ్డు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి హైవేపై అదుపు తప్పిన కారు, డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అచ్చెన్నాయుడితో పాటు పలువురు గాయాల పాలయ్యారు. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి చిన్న గాయమైంది. వెంటనే ఆయన్ను నక్కపల్లి హాస్పిటల్ లో ప్రథమ చికిత్స అందించారు.
క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం గుంటూరు పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారనే వార్త వినగానే టీడీపీ శ్రేణులు కాస్త భయపడ్డాయి. ఆయనకు తగిలిన గాయం చిన్నదేని తెలుసుకొని ఊపిరి పిల్చుకున్నాయి. అచ్చెన్న సోదరుడు కింజారపు ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయిన విషయం అందరికి తెలిసిందే.
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ అయిన ఎర్రన్నాయుడు.. 2012 నవంబర్ నెల విశాఖపట్నంలో ఓ పెళ్లికి హాజరై ఎర్రన్నాయుడు కారులో తిరిగి వస్తుండగా, అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట క్రాస్ రోడ్ వద్ద ఆయన వాహనం పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఎర్రన్నాయుడికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతూ ఎర్రన్నాయుడు తుదిశ్వాస విడిచారు. మళ్లీ ఇలాంటి సంఘటన అదే కుటుంబంకి సంబంధించిన వ్యక్తికి సంభవించడంతో టీడీపీ శ్రేణులు భయభ్రాంతులు అయ్యారు. చిన్న గాయాలే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయాల పాలైన వ్యక్తుల ఆరోగ్యం కూడా సురక్షితంగానే ఉందని ఎమ్మెల్యే వర్గం వారు తెలిపారు, ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సుమా.