చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ స్కైవర్త్‌  భారీ పెట్టుబడులను  తెలంగాణ రాష్ట్రంలో  పెట్టేందుకు  సిద్ధమవుతోంది. తొలి దశలో హైదరాబాద్‌ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 700 కోట్ల పెట్టుబడితో  ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనికి  సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్‌ గ్రూప్‌ చైర్మన్‌ లై వీడ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది.

 

ఇప్పటికే ఎల్‌ఈడీ టీవీలను మనకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్‌ బ్రాండ్‌ ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా  ఇటీవల స్కైవర్త్‌ ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లను తయారు చేయాలని  నిర్ణయించింది. దీనిపై  పరిశ్రమశాఖ వర్గాలు  స్పందిస్తూ ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించి దేశంలోకెల్లా భారీ చైనా పెట్టుబడుల్లో ఒకటిగా  నిలుస్తుంది అని అభివర్ణిస్తున్నాయి.రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో 5 వేల మందికి స్కైవర్త్‌ పెట్టుబడులతో  ఉపాధి అవకాశాలు లభిస్తాయని  వెల్లడించారు.

 

ఇప్పుడు తెలంగాణ టీఎస్‌ ఐపాస్‌ వంటి విప్లవాత్మక పారిశ్రామిక అనుకూల విధానాలతో అనేక కంపెనీల పెట్టుబడులకు  గమ్యస్థానంగా మారుతోందన్నారు. నైపుణ్యం గల మానవవనరులతోపాటు శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమాన, రవాణా సౌకర్యాలు తదితరాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. స్కైవర్త్‌ భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

స్కైవర్త్‌ చైర్మన్‌ లై వీడ్‌  తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టేందుకు  అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.... వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యతగల  స్కైవర్త్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు.అంతే కాదు భారత్‌ దేశం తమ సంస్థ కార్యకలాపాలకు  వ్యూహాత్మక మార్కెట్‌ అని, స్కైవర్త్‌ నాణ్య త, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు  వినియోగదారుల ఆదరణ పొందినట్లు స్కైవర్త్‌ ఉపాధ్యక్షుడు వాంగ్‌ జెంజున్‌ తెలిపారు. సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరక్టర్‌ సుజయ్‌ కారంపురి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ ఈ.వి.నర్సింహారెడ్డి  కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: