హైదరాబాద్ అంటే ఒకప్పుడు ప్రశాంతతకు చిహ్నంగా ఉండేది. ఆ తరువాత ఉగ్రవాదుల మూలాలు ఉన్నాయని భయపడ్డారు. దాదాలు, గూండాలు ఉంటున్నారని ప్రజలు ఆందోళన చెందారు. కానీ, ఇప్పుడు మానవ మృగాలు మనుషుల మధ్య తిరుగుతున్నారని తెలిసి ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. ఆరు నెలల చిన్నారి నుంచి అరవై ఏళ్ళ ముదుసలి వరకు ఎవర్ని వదలడం లేదు. అమ్మాయి అయితే చాలు.. కామాంధులు కన్నేస్తున్నారు.
కామదాహాన్ని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే నాలుగైదు హత్యలు, మానభంగాలు జరిగాయి అంటే మనుషులు ఎంతగా మారిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. హనుమకొండలో మానస ఉదంతం మరువక ముందే.. హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ప్రియాంక రెడ్డిని సజీవ దహనం చేసిన ప్రాంతానికి కొద్దిదూరంలోనే మరో మహిళా శవం దహనం అవుతూ కనిపించింది. ప్రియాంక రెడ్డి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ.. నిందితులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది.
ఇది జరిగిన తరువాత పోలీసులు మీడియా ఎలాంటి ఆపద ఉన్న 100 ఫోన్ చేయాలనీ ప్రజలను కోరారు. ప్రజలు తమ వద్ద తప్పనిసరిగా 100 నెంబర్ పెట్టుకోవాలని, ఎలాంటి ఆపద వచ్చినా సరే 100 కి డయల్ చేయాలనీ పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకు పోలీసులకు రాజేంద్ర నగర్, ఆరాంఘర్ ప్రజల నుంచి ఫోన్ వచ్చింది. రాజేంద్ర నగర్ లో ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని ఫోన్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
సమాచారం అందుకొని వెంటనే పోలీసులు వాహనాన్ని వెంబడించారు. వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. అయితే, ఆ వాహనంలో మహిళలు ఎవరు లేరు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 కి డయల్ చేసిన వ్యక్తిని విచారించగా తాను పొరపాటున ఫోన్ చేసినట్టు చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం విచారణను సీరియస్ గా కొనసాగిస్తున్నారు. ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా విచారణ చేస్తున్నారు.