ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఈనాటితో ఆరు నెలల కాలం అయింది. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది వైస్సార్సీపీ. ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను, 22ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలను తుత్తునీయలు చేసింది వైసీపీ. అత్యధిక స్థానాలు సాధించిన వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మే 30న కొలువు దీరిన జగన్ ప్రభుత్వం ఈ రోజుకు ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల కాలంలో జగన్ ఉత్తమ సీఎం అనిపించుకునే దిశగా అడుగులు వేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నవరత్నాలను ఓ భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా భావించి ఏకంగా పార్టీ మ్యానిఫేస్టోకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మ్యానిఫేస్టో ప్రకారం తన ప్రాధాన్యతను గుర్తించి పనులు చేసుకుంటూ పోతున్నారు. నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు.
అయితే జగన్ ప్రభుత్వంపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. జగన్పై ఉన్న అంచనాల మేరకు తనవంతుగా పని చేస్తూ ముందుకు సాగుతున్నారు. అసలే పరిపాలన అనుభవం లేని జగన్ తన సీనియర్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ, సలహాదారుల పర్యవేక్షణలో నిర్ణయాలు తీసుకుంటూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అయితే పరిపాలనలో అనుభవం ఉన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తో పోల్చుకుంటే ఏపీ సీఎం జగన్ ఎన్నో రేట్లు మెరుగుగా కనిపిస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ఏపీలో కార్పోరేషన్గా ఉన్న ఆర్టీసీని కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వంలో విలీనం చేసి రికార్డు సృష్టించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాదు.. ఏకంగా ఉద్యోగులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కేసీఆర్ చేయని సాహసం చేశారు జగన్. ఏపీ సర్కారు చేసిన ఆర్టీసి విలీనం తెలంగాణ సీఎంకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏపీలో జగన్ చేసిన ఆర్టీసీని విలీనం చేసిన తీరుగా తెలంగాణలోనూ ఆర్టీసిని విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో దాదాపుగా 52రోజులు సమ్మె బాట పట్టారు ఆర్టీసీ కార్మికులు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కేసీఆర్ తలబొప్పి కట్టినప్పటికి ఏపీలో మాత్రం ఆర్టీసీ కార్మికులంతా ఉద్యోగులై ఊపిరి పీల్చుకున్నారు. ఓ అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ చేయలేని పనిని కేవలం ఎంపీగా ఐదు ఏండ్లు, ప్రతిపక్ష నేతగా ఐదేండ్లు పనిచేసిన జగన్ సీఎం కాగానే చేయడం అనేది ఓ రికార్డుగానే భావిస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పోరేషన్ కిందనే ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఆర్టీసీ కార్మికులకు జగన్ దేవుడయ్యాడు. అంటే జగన్ తన ఆరు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాల్లో ఆర్టీసీ విలీనం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అతి ముఖ్యమైనదిగా భావించవచ్చు. ఆర్టీసీ చరిత్రలో ఏ సీఎం చేయని నిర్ణయం కేవలం జగన్ చేసి చూపించారు. అందుకే జగన్ను ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు గట్స్ ఉన్న సీఎం అంటున్నారు.