మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయ్యిన తరువాత కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని స్థాపించిన తరువాత ఆ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీకి సపోర్ట్ చేశారు. ఈ రెండు పార్టీలకు సపోర్ట్ చేయడంతో.. ఆ రెండు పార్టీలు విజయం సాధించాయి. అయితే, బయట నుంచి మాత్రమే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసారుగాని, ప్రభుత్వంలో చేరలేదు.
ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్, ఆ తరువాత కొన్ని రోజులు టిడిపితో కలిసిమెలిసి ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పోటీలో ఓట్లశాతం సాధించింది. కానీ, గెలిచేంతగా మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ ఎదగలేకపోయింది. పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇలా ఎందుకు జరిగింది అన్నది వేరే విషయం.
నవంబర్ 3 వ తేదీన పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత నుంచి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ వాదిస్తున్నారు. ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ కు పార్టీలో అత్యంత సన్నిహితుడిగా ఉన్న పరిధిపూర్ నరసింహ అనే వ్యక్తి జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి జనశంఖారావం అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. నరసింహ గతంలో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు.
అయితే, ఇప్పుడు నరసింహ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం సంచలనంగా మారింది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదగాలని అనుకుంటోంది. ఈ సమయంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కొత్తపార్టీ పెట్టడంతో జనసేనకు కొంతమేర షాక్ అని చెప్పాలి. 2018 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణ నుంచి పోటీ చేయలేదు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.