నవ్యాంధ్రప్రదేశ్లో అధికార బదలాయింపు జరిగి.. జగన్ పరిపాలన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తి అయింది. అంటే 180 రోజుల పాలన అన్నమాట. ఈ 180రోజుల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. పరిపాలన తీరు ఓసారి పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు.. విశేషాలు తెలుస్తాయి. ఆరు నెలల ఏపీ పాలనకు, అంతకు ముందు కొనసాగిన ఐదు సంవత్సరాల టీడీపీ పాలనకు బేరీజు వేసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అయితే గత పాలనలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగుల పరిస్థితి, ఆరు నెలల జగన్ పాలనలోని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితికి తేడా చూస్తే భారీగా వ్యత్యాసం కనపడుతుంది.
ఇంతకు ఏపీలో జగన్ పరిపాలనలో ఆరు నెలల కాలంలో అంతగా గొప్పగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ప్రయోజనాలు జరిగాయో, ఏపీలోని యువతకు ఏమైనా లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకున్నారో, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏమైనా చేశారా లేదా.. ఓసారి చూస్తే తెలుస్తుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టింది ఇదే మొదటిసారి. ఇంతకు ముందు తాను ఎంపీగా పనిచేశారు. అప్పుడు తండ్రి చాటు బిడ్డగా ఉన్నారు జగన్. జగన్ ఎంపీగా ఉండగానే దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్గస్థులయ్యారు. తరువాత ఏపీ విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ ప్రతిపక్ష నేతగా ఎంతో సమర్థవంతంగా పనిచేశారు.
పరిపాలన అనుభవాన్ని అంతా ప్రతిపక్షనేతగా పనిచేసిన కాలంలో ఒంటబట్టించుకున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరిగి ప్రజలకు కావాల్సిన అవసరాలు, అధికార పక్షం ప్రజలతో ఎలా ఉండాలో స్వయంగా ప్రజలతో తెలుసుకున్నారు. ఇప్పుడు అధికార పక్షంలోకి రాగానే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పరిపాలన చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీపైనా, పరిపాలన చేసే యంత్రాంగంపైనా ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారో.. ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారో ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారో అర్థం చేసుకున్నారు జగన్.
తాను అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపం చూపకుండా.. వారి ప్రయోజనాల కోసం పని చేయడం మొదలెట్టారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎఫ్ తో కలుగుతున్న నష్టాన్ని తొలగించేందుకు సీపీఎఫ్ విధానాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సీపీఎఫ్ రద్దు అయితే వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. సీపీఎఫ్ రద్దు కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు జగన్ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఉంది. జగన్ ఈ రద్దు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు జగన్కు విధేయులుగా మారిపోవడం ఖాయం.
ఇప్పటికే జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడంతో ఆర్టీసీ కుటుంబాలను మొత్తం తన వైపు గంపగుత్తగా లాక్కున్నాడు. తెలంగాణలోని ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూసిన ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు చేసినట్లే జగన్. అందుకే ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు జగన్ కు ఓ సైన్యంగా తయారయ్యారు. ఇక సచివాలయాల పేరుతో ఒక్కదెబ్బతో నాలుగు లక్షల ఉద్యోగాలను నియమించారు. ప్రతి ఊరులో దాదాపు డజన్కు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో ప్రతి గ్రామంలో ఉద్యోగాలు పొందినవారంతా జగన్ జపం చేస్తున్నారు.
ఇక ప్రధానంగా ఏపీలో పోలీసు ఉద్యోగుల పరిస్థితి చూస్తే జగన్ను జీవితాంతం తన ఆరాధ్య నాయకుడిగా ఆరాధించినా తప్పులేనంత మేలు చేశాడు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులు ఇప్పుడు తన కుటుంబంతో వారానికి ఒకరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్ ఆఫ్ను కానుకగా ఇచ్చారు జగన్. అంతేకాదు హోంగార్డులకు వేతనాలు పెంచారు. దీంతో పోలీసు కుటుంబాలు జగన్కు ఇప్పుడు కీర్తిస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగంలోనే కాకుండా, ప్రైవేటు రంగంలో, పారిశ్రామిక రంగంలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది స్థానిక ప్రజలకు, యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో ప్రజల్లో జగన్ పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద పీట వేస్తున్నారు. అందుకే జగన్ పట్ల ఏపీ ఉద్యోగుల్లో ఆరాధాన భావం నెలకొనగా, ఏటా ఉద్యోగ కేలండర్ను విడుదల చేసి కొలువుల జాతరకు నాంది పలుకుతున్నారు.