నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో మత్తుపదార్ధాల వినియోగం పెరిగిపోతుంది. రాజధానితో పాటు 13 జిల్లాల్లో మత్తుపదార్ధాల వినియోగం.. రవాణా వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. నూతన రాజధాని ప్రాంతం కావడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విదేశీయులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. చదువు పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి నివసిస్తుండడంతో చాటుగా మత్తు పదార్థాల రవాణా వినియోగం విస్తరించటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మత్తు పదార్థాల రవాణా అధికంగా జరుగుతుంది. ఇందులోనూ గంజాయి వినియోగం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
రాజధాని ప్రాంతంలో గంజాయితో పాటు వైట్నర్ లాంటి పదార్థాలను సైతం విద్యార్ధులు ఆశ్రయిస్తున్నారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన ఘర్షణ వ్యవహారంలో ఈ ఘటన వెలుగు చూసింది. మత్తు పదార్ధాలు సేవించిన విద్యార్థులు ఏకంగా అధ్యక్షుడి పైనే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఫలితాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మత్తు పదార్థాలను స్థానిక మందుల దుకాణంలో కొనుగోలు చేశారని తెలుసుకున్న పోలీసులు యజమానిపై కేసు పెట్టారు.
మరోవైపు టోల్గెట్ కేంద్రంగా గంజాయి రవాణా అధికంగా జరుగుతోంది. పలుమార్లు పోలీసులు రవాణాదారులను అరెస్ట్ చేసినప్పటికీ వారు విడుదలై తిరిగి వచ్చి అక్రమ రవాణ సాగిస్తున్నారు. విజయవాడలో పోలీసులు డ్రగ్స్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. గంజాయితో పాటుగా ఇతర మత్తు పదార్థాలను వినియోగిస్తున్న విదేశీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. వీరంతా తాడేపల్లి , ఉండవల్లిలో ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటూ చదువు పేరుతో మత్తుకు అలవాటు పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో విదేశీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న షాజీ నుంచి గంజాయితో పాటుగా తెల్లరంగు పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్ధాల రవాణాపై డీజీపీ సవాంగ్ ప్రత్యేకంగా సిఐడి ఆధ్వర్యంలో నార్కోటిక్ సెల్ ను రంగంలోకి దించారు. వాట్సప్ నెంబర్ ను కూడా విడుదల చేశారు.
మత్తు పదార్థాల రవాణా పై ఫిర్యాదు చేయాలనుకునే వారు 7382296118 నెంబర్ కు వాట్సప్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించి.. రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు శ్రమిస్తున్నారు ఏపీ పోలీసులు.మత్తులో జోగుతున్న యువత.. ఎప్పుడు మత్తు వీడుతుందో తెలియదు కానీ.. మత్తు వీడేలా సర్కారు, పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.