ప్రస్తుతం...ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటే..ఆడబిడ్డలను రాబందుల రాజ్యంలోకి... రాకాసుల మూక మధ్య పంపుతున్న భయం కలుగుతోంది. షాద్ నగర్లో జరిగిన ఘటనలో క్రూరత్వం అంత భయానకంగా ఉండటం వల్లే...ఆ ఆడబిడ్డను హింస పెట్టిన ఘటనపై ఓ వైపు జనాగ్రహం పెల్లుబుకుతోంది. నిందితులను ఉరితీయాలంటూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర స్వచ్ఛందంగా ప్రజలు నిరసనకు దిగడమే దీనికి నిదర్శనం. ‘ఆ మానవ మృగాలను మాకు అప్పగిస్తారా? మీరే ఎన్కౌంటర్ చేస్తారా?’ అని నినాదాలు చేశారు.
అయితే ఇలా ఒక పక్క డాక్టర్ ప్రియాంక ఉద్ధతం మరువక ముందే కృష్ణాజిల్లా కొండపల్లిలో విజయవాడలో ఓ ఈవ్ టీజర్ బరి తెగించాడు. కొండపల్లి ఆరు పంపుల సెంటర్ వద్ద కొంతకాలంగా వివాహితను సాయి చైతన్య అనే ఓ ఆకతాయి కొంతకాలంగా వేధిస్తున్నాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. అయితే, సాయి చైతన్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళ పలుమార్లు మందలించింది. అయినప్పటికీ, వాడి బుద్ధి మారలేదు. పాఠశాలలో చదువుతున్న పిల్లలకు శనివారం క్యారెజ్ ఇచ్చేందుకు ఆమె వెళ్లింది. అయితే ఈ సమయంలోనూ సాయి చైన్య తన పోకిరి పనులు మానుకోలేదు. ఆమె తిరుగు ప్రయాణంలో మరోసారి మహిళను వేధింపులకు గురి చేశాడు.
దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ ఆకతాయి సాయి చైతన్యకు దేహశుద్ది చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు సైతం సాయిని నిర్బంధించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయి సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. కాగా,మహిళలు ఎవరినీ అమాయకంగా నమ్మవద్దని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించే వారిని చూసిచూడనట్లు వదిలివేయకుండా...కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. కొందరికైనా ఘాటుగా బుద్ధి చెప్తే మిగతా వారి ఆలోచనల్లో మార్పు వస్తుందని పేర్కొంటున్నారు.