`సినిమాల్లో తొలి ఇన్నింగ్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని..ఆరోగ్య ఇబ్బందుల అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ లాంచ్ చేసిన స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారా? సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బ్రహ్మనందం తన పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావిస్తున్నారా? అందుకే బహిరంగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతిచ్చారా? `` ఈ ప్రశ్నలన్నీ...సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇంతకీ....సోషల్ మీడియాలో ఈ చర్చ జరిగేందుకు కారణం...బ్రహ్మానందం తాజాగా వార్తల్లో నిలిచిన తీరు. కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల పోరులో భాగంగా చిక్కబళ్ళాపురలో బీజేపీ అభ్యర్థి సుధాకర్రెడ్డి తరపున పాల్గొని ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించిన సందర్భంగా బ్రహ్మానందం తెలుగులోనే మాట్లాడటే కాకుండా పలు తెలుగు సినిమా డైలాగ్స్ వేస్తూ... అభిమానుల్లో ఉత్సాహం నింపారు. బ్రహ్మానందంను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ..బీజీేపీ అభ్యర్థికి సుధాకర్కు అంతా ఓటేసి గెలిపించాలని కోరారు. సుధాకర్ రెడ్డి తనకుమంచి మిత్రుడని, అందుకే ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చానని వివరించారు.
అయితే, ఈ ప్రచారాన్ని చూసిన నెటిజన్లు బ్రహ్మానందం అడుగులపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సినీపరిశ్రమలోని కొందరు ప్రముఖులు ఆయా రాజకీయ పార్టీలకు దగ్గరవుతున్న తరుణంలో...ప్రముఖ తెలుగు హాస్యనటుడైన బ్రహ్మానందం సైతం రాజకీయంగా తమ వేదికను వెతుక్కుంటున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే బ్రహ్మానందమే స్పందించాలి మరి!
ఇదిలాఉండగా, మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బ్రహ్మానందంను బీజేపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి ప్రచారానికి ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు.