సమాజంలో, దురదృష్టవశాత్తు ప్రస్తుతం....నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న రేప్ ఘటనల్లో మానవ మృగాలు వాటి పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంటున్నాయి. ఈ ఘటనల్లో ఎన్నింటికి శిక్ష పడుతోందో.. ఎన్నాళ్లకు పడుతోందో చూస్తూనే ఉన్నాం. కానీ, ఇవే కాదు మన చుట్టూ నిత్యం మన చుట్టూ మంచిగానే కనిపిస్తూ ముసుగులు వేసుకుని తిరుగుతున్న మృగాలు చాలా ఉన్నాయనే భావన కలుగుతోంది. శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం, హత్య చేసిన నిందితులకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వైపు డాక్టర్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే… అమ్మాయిలను రేప్ చేయడం తప్పులేదంటూ అసభ్యకరంగా.. పోస్టులు పెట్టిన కొందరికి తగిన శాస్తి జరిగింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొందరు ప్రియాంకరెడ్డి హత్య ఘటనపై వికృతంగా పోస్టులు, కామెంట్లు చేసి.. పైశాచికానందాన్ని పొందారు. చాలా మంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు నష్టపోతున్నారని, రేప్ చేయడం తప్పుకాదని అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు స్మైలీ నాని అనే ఫేస్బుక్ యూజర్. హార్మోన్స్ వల్ల కంట్రోల్ చేసుకోలేక రేప్ చేస్తారని సమర్థించేలా మాట్లాడాడు అతడు. ఇంకా కొందరు మరీ అసభ్యమైన కామెంట్లు కూడా పెట్టారు. వీళ్లను కూడా ఎవరైనా కనిపిస్తే రేప్ చేస్తారేమో, వెంటనే అరెస్టు చేయాలంటూ ఎల్బీనగర్ వాసులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమర్ నాథ్, శ్రవణ్, సందీప్ కుమార్, స్మైలీ నాని అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఎవరైనా అసభ్యకరంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తేల్చిచెప్పారు.
డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మరోమారు స్పందించారు. డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే పోలీసులు సరైన సమయంలో బాధితురాలి దగ్గరకు చేరుకునే వారని మంత్రి తెలిపారు. ఆమె హత్యను ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని, 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేశారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.