తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల‌కు తీపిక‌బురు చెప్పారు. ఒక‌టి కాదు రెండు కాదు అన్న‌ట్లుగా ప‌లు అంశాల్లో ఆర్టీసీ కార్మికుల‌ను ఆయ‌న ఖుష్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇ.డి.లు, ఆర్ఎంలు, డివిఎంలు, డిఎంలు, కంట్రోలర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా, ప్రతీ సమస్యపైనా సిఎం స్పందించారు. అప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 

ఈ క్ర‌మంలో ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ప్ర‌క‌టించారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ఆయ‌న హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, సమ్మె కాలానికి  సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: