55 రోజులపాటు కార్మికులు సమ్మె చేసినా ఆ సమ్మె దాదాపుగా వృధాగా పోలేదు. సమ్మె సమయంలో కార్మికులపై కోపావేశాలు ప్రదర్శించినా.. సమ్మె విరమించిన తరువాత వారిని సున్నితంగా మందలించి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఉద్యోగాల్లోకి తీసుకున్న తరువాత కెసిఆర్ తెలంగాణలోని 97 డిపోల నుంచి ఐదుగురు చొప్పిన మొత్తం 700 మందిని ఈరోజు ప్రగతి భవన్ కు పిలిచారు. వారిలో సగం మంది మహిళలు కూడా ఉన్నారు.
వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అంతేకాదు, భోజనం తరువాత కెసిఆర్ వాళ్లతో ఆర్టీసీ గురించి, ఆర్టీసీలో ఉన్న బాధాకసాధకాల గురించి మాట్లాడారు. అన్ని విషయాలను తెలుసుకున్నారు. అంతేకాదు, సమ్మె చేసే ముందు వాళ్లకు ఇవ్వాల్సిన సెప్టెంబర్ నెల జీతాలు రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 11 నుంచి 12 లోపు వాళ్ళ అకౌంట్స్ లోకి జీతాలు రాబోతున్నాయి. ఇది ఆర్టీసీ కార్మికులకు శుభవార్తే అని చెప్పాలి. అంతేకాదు, సమ్మె చేసిన 55 రోజులకు కూడా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు.
ఆ జీతాలు కూడా త్వరలోనే ప్రభుత్వం చెల్లిస్తుందని కెసిఆర్ వారికీ వివరించారు. అక్కడితో ఆగిపోలేదు. వచ్చే ఏడాది నుంచి ఆర్టీసీ కోసం ప్రతి ఏడాది బడ్జెట్ లో వెయ్యి కోట్లు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఇది ఆర్టీసీ బలోపేతానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తేనే. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తే.. సింగరేణి కార్మికులకు ఇచ్చినట్టుగానే బోనస్ లు ఇస్తామని చెప్పారు. డిపోలో ఉండే మహిళా కార్మికుల కోసం ప్రత్యే సదుపాయాలు, డ్యూటీ చేసే మహిళలు రాత్రి 8 లోపే వారి డ్యూటీలు ముగిసేలా చూస్తామని అన్నారు.
అదే విధంగా మహిళా ప్రసూతి సెలవులు పెంచాలని నిర్ణయించినట్టు కెసిఆర్ పేర్కొన్నారు. ఇక బస్సుల్లో ఎవరైనా టికెట్ తీసుకోకుంటే కండక్టర్ పై చర్యలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు.. కండక్టర్ పై చర్యలు తీసుకోకూడదని కెసిఆర్ పేర్కొన్నారు. ఎవరైతే టికెట్ తీసుకోలేదో వారిపైనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రేపటి నుంచి ప్రయాణికులకు జేబులకు చిల్లులు పడబోతున్నాయి. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెరగబోతున్నాయి. ఈ లెక్కన బస్సు పాస్ లు కూడా పెరుగుతాయి.