చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాకు రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి మీద విధ్వేషం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో కొట్టిన దారుణమైన ఓటమిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటే అర్ధముంది ? మరి ఎల్లోమీడియాకు ఏమైంది ? ప్రతిరోజు జనాలకు నీతులు చెప్పే ఎల్లోమీడియా కూడా ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వంపై విషం చిమ్మాల్సిన అవసరమైతే లేదు. కానీ తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానం పంచాంగంలో శ్రీ యేసయ్య వెంకటేశాయనమః అని ఉందంటూ నారా రచ్చ చేస్తోంది.
చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న చానల్స్ లో ఇదే విషయమై శనివారమంతా ఒకటే గోల జరిగింది. దానికి వత్తాసుగా టిడిపి నేతలు రంగంలోకి దిగిపోయారు. ఎప్పుడైతే తమ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయో వెంటనే టిడిపి నేతలు కూడా జగన్ పై ఆరోపణలు మొదలుపెట్టేశారు.
సిఎం అయిన దగ్గర నుండి జగన్ ముఖ్యంగా టిటిడిలో క్రిస్తియన్ మతాన్ని బలవంతంగా చొప్పిస్తున్నారంటూ మొదలుపెట్టేశారు. అన్యమత ప్రచారాన్ని తిరుమలతో ప్రోత్సహిస్తున్నారంటూ ఒకటే గోల చేస్తున్నారు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఇదే విషయమై ప్రముఖంగా మొదటిపేజిలో కథనం కూడా అచ్చేశారు.
టిటిడి పంచాంగంలోనే శ్రీ యేసయ్య వెంకటేశాయనమః అని ఉందని గోల మొదలైందో వెంటనే టిటిడి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. అసలు విషయం ఏమిటంటే శ్రీ యేసయ్య వెంకటేశాయనమః అని కనిపించిన వెబ్ సైట్ కు టిటిడి వెబ్ సైట్ కు సంబంధమే లేదు. టిటిడికి సంబంధం లేని ఎవరిదో వెబ్ సైట్లో అలా కనిపిస్తుంటే దాన్ని టిటిడికి అంటకట్టేసింది ఎల్లోమీడియా.
ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా తయారైంది టిడిపి, ఎల్లోమీడియా వ్యవహారం. జగన్ మీదున్న కసిని తీర్చుకోవటానికి టిడిపి, ఎల్లోమీడియా చివరకు టిటిడిని కూడా వాడేసుకుంటోంది. సరే వీళ్ళకు జగన్ పై ఎంత కోపమున్నా ఓ విషయం మరచిపోతున్నారు. వీళ్ళకు ఇష్టమున్నా లేకపోయినా ఐదుళ్ళు జగనే సిఎం అని.